HYD: హైదరాబాద్లో హై అలర్ట్

హైదరాబాద్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో మెట్రో నగరాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. బస్టేషన్లు, రైల్వే స్టేషన్లు , శంషాబాద్ ఎయిర్ పోర్టులలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్లో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో అధికారులు తనిఖీలు నిర్వహించారు. మతపరమైన ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలు, షాపింగ్ మాల్స్లోనూ సోదాలు జరుగుతున్నాయి. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సిటీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హోటల్స్పై పోలీసులు నిఘా పెంచారు. దేశంలో ఎక్కడ, ఏ ప్రాంతంలో పేలుళ్లు జరిగినా వాటి మూలాలు హైదరాబాద్లో ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది. ఎన్ఐఏ, వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీసులు రాష్ట్రంలో తనిఖీలు చేయగా.. అనుమానిత వ్యక్తులు పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. రాజేంద్రనగర్లో ఉగ్రవాద ఆరోపణలతో డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
విమానాలకు బాంబు బెదిరింపు
గురుగ్రామ్లోని ఇండిగో ప్రధాన కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు బాంబు బెదిరింపు మెయిళ్లు పంపించారు. దేశ రాజధాని ఢిల్లీ, కోల్కతా, తిరువనంతపురం నుంచి నడుస్తున్న పలు విమానాల్లో బాంబు అమర్చినట్లు బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన ఎయిర్లైన్స్ అధికారులు సంబంధిత విమానాశ్రయ అధికారులను అప్రమత్తం చేశారు. కోల్కతా నుంచి ముంబైకి వెళుతున్న ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్లు బెదిరింపు రావడంతో, ఆ విమానంలోని 186 మంది ప్రయాణికులను కిందకు దించి, విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. ఢిల్లీ, తిరువనంతపురం విమానాశ్రయాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. బాంబు స్క్వాడ్ బృందాలతో ఇండిగో విమానాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

