HYDERABAD: కోఠి ఎస్బీఐ కార్యాలయం వద్ద కాల్పులు

హైదరాబాద్ కోఠి ప్రాంతంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ వద్ద ఉదయం సుమారు 7 గంటల సమయంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఏటీఎంలో నగదు జమ చేసేందుకు వచ్చిన రషీద్ అనే వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని దుండగులు పక్కా ప్రణాళికతో దాడి చేశారు. కాల్పుల్లో రషీద్ కాలికి బుల్లెట్ గాయం కాగా, అతని వద్ద ఉన్న సుమారు రూ.6 లక్షల నగదును దుండగులు అపహరించి అక్కడి నుంచి పరారయ్యారు.
స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన రషీద్ను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఎస్బీఐ కార్యాలయం పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ, నిందితులను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
