Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపులు.

Phone Tapping Case :  ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపులు.
త్వరలో మాజీ మంత్రులకు నోటీసులు, తెరపైకి మరో సీనియర్ అధికారి పేరు

సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం కీలక మలుపులు తిరుగుతోంది. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు సంచలనాత్మక విషయాలు పేర్కొన్నారు. 2014లో Brsప్రభుత్వం ఏర్పడ్డాక.. ప్రభాకర్‌ రావును SIB చీఫ్‌గా నియమించగా.. అదే సామాజిక వర్గానికి చెందిన అధికారులును ఏరి కోరి మరీ ప్రభాకర్‌రావు తన బృందంలో నియమించుకున్నట్లు నివేదికలో పొందుపరిచారు. ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులు, వారి మద్దతుదారులు, వ్యాపారస్తులు, ప్రతిపక్ష నేతలతోపాటుగా భారాస పార్టీ నేతలు అప్పటి ప్రభుత్వ పెద్దల నియంత్రణలోనే ఉండేలా ఈ బృందం నిఘా పెట్టినట్లు రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటీవల టాస్క్‌ఫోర్స్ మాజీ DCP రాధాకిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేయగా.. ఆయన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను పొందుపరిచారు. 2014లో భారాస ప్రభుత్వం ఏర్పడ్డాక 2016లో SIBచీఫ్‌గా ప్రభాకర్ రావును నియమించారని.. ఆ తర్వాత తన వర్గం వారిని అందరికీ ఏకం చేసి ఓ టీంగా ఏర్పరచి ఒక బృందంలోకి బదిలీ చేయించుకున్నారని తెలిపారు. నల్గొండ నుంచి ప్రణీత్ రావు, రాచకొండ కమిషనరేట్ నుంచి భుజంగరావు, హైదరాబాద్ సిటీ నుంచి తిరుపతన్న, సైబరాబాద్ నుంచి వేణుగోపాల్ రావును SIBకి మార్చుకున్నారు. కీలకమైన టాస్క్ ఫోర్స్ DCP పోస్టులో ప్రభుత్వ అదేశాలతో 2017లో రాధాకిషన్ రావును నియమించారు. శాఖాపరమైన వ్యవహారాలతోపాటు రాజకీయపరంగా నిఘా పెట్టేందుకు ఆదేశాలు జారీ చేశారు. వీరు నలుగురూ తరచూ కలుస్తూ భారాస పార్టీ బలోపేతానికి కృషి చేసినట్లు రాధకిషన్ రావు వెల్లడించారు. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్పెక్టర్‌గా పనిచేస్తున్న గట్టుమల్లును ప్రభాకరావు ఆదేశాల మేరకు SIBకి బదిలీ చేశారు. వీరి కార్యకలాపాలను ఇతరులు గమనించకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకునే వారని వెల్లడించారు. ముందుజాగ్రత్త చర్యగా సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, సిగ్నెల్, స్నాప్‌చాట్ లలో మాత్రమే తరచూ సంప్రదింపులు జరుపుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

రాధాకిషన్ రావు తన సామాజికవర్గాన్ని అడ్డుపెట్టుకుని అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో తన సర్వీస్‌ 2020 ఆగస్టులో ముసిగినా.. మరో మూడేళ్ళు టాస్క్‌ఫోర్స్ OSD గానే కొనసాగినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ప్రభాకర్ రావు ప్రోద్బలంతోనే SIBలోకి వచ్చిన ప్రణీత్ రావు.. అతని అడుగుజాడల్లోనే నడిచారని.. ప్రభాకర్ రావు IG అయిన తర్వాత SIBలో ప్రత్యేక SOT బృందాన్ని ఏర్పాటు చేశారని స్పష్టంచేశారు. వీరి ముఖ్య లక్ష్యం.. ప్రతిపక్ష నాయకులతోపాటు భారాస రెబల్స్‌పై నిఘా పెట్టడమని తేల్చారు. జనంలో పేరున్న నాయకులు, క్యాడర్ ఉన్న వారిని గుర్తించడమే లక్ష్యంగా పనిచేసినట్లు రాధాకిషన్ రావు విచారణలో వెల్లడించారని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. SIB, టాస్క్‌ఫోర్స్‌లోనూ పనిచేసేందుకు ప్రభాకర్ రావు వారికి అనుకూలంగా పనిచేసే వారిని నియమించుకున్నట్లు వెల్లడించారు. మాజీ అదనపు SP వేణుగోపాల్ రావు, భుజంగరావు, తిరుపతన్న ఇతర అధికారులు ప్రభాకర్ రావు బృందంలో ఉన్నట్లు తెలిపారు. భారాస మూడోసారి గెలుపొందేందుకు ప్రతిపక్షనేతలు, వారి మద్దతుదారులు, కుటుంబ సభ్యులు, వ్యాపారస్తులతోపాటు సొంతపార్టీ నేతలు సైతం అప్పటి ప్రభుత్వ పెద్దలు నియంత్రణలోనే ఉండేలా ఈ బృందం నిఘా పెట్టినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. నేరుగా అప్పటి ప్రభుత్వ పెద్దలకు ఎప్పటికప్పుడు నివేదించినట్టు పోలీసులు తేల్చారు.

Tags

Read MoreRead Less
Next Story