తాగి వాహనాలు నడిపితే పబ్లు, బార్ల యజమానులదే బాధ్యత: హైదరాబాద్ పోలీసులు
నూతన సంవత్సర వేడుకల్లో రోడ్లపై రాత్రంతా జనం సంచారం, వాహనదారుల చక్కర్లు, మందుబాబుల ఆగడాల్ని అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ప్రమాదాలు జరగకుండా, శాంతిభద్రతలకు విఘాకం కలగకుండా వేడుకలపై ఆంక్షలు విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
హైదరాబాద్లో నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఔటర్ రింగ్ రోడ్డును మూసి వేయాలని నిర్ణయించారు. ఎయిర్పోర్ట్కు వెళ్లే వాహనాలకు మాత్రమే ఔఆర్ఆర్పై అనుమతి ఇస్తామని పోలీసుశాఖ స్పష్టంచేసింది. నగరంలో పీవీ ఎక్స్ప్రెస్ హైవే, సైబర్ టవర్, గచ్చిబౌలి, బయో డైవర్సిటీ, మైండ్స్పేస్, ఫోరంమాల్-జేఎన్టీయూ, దుర్గం చెరువు బ్రిడ్జీలు క్లోజ్ చేయనున్నట్టు వెల్లడించింది.
అటు మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ఉక్కుపాదం మోపనున్నట్టు పోలీసులు స్పష్టంచేశారు. ఎవరైనా తాగి వాహనాలు నడిపితే వారికి మద్యం విక్రయించిన పబ్లు, బార్ల యజమానులదే బాధ్యత అని హెచ్చరించారు. తాగిన వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేలా బార్లు, పబ్ల యజమానులే చూడాలని తేల్చిచెప్పారు. అలాగే రాత్రంతా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టనున్నట్టు తెలిపారు.
నూతన సంవత్సర వేడుకల్లో ప్రమాదాల్ని అరికట్టేందుకు పోలీసులు ఆంక్షలు విధించారు. మైనర్లకు వాహనం ఇస్తే యజామనితో పాటు నడిపిన వారిపైనా కేసు నమోదు చేయనున్నారు. తాగి వాహనం నడిపితే 10వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష ఉంటుందని పోలీసులు హెచ్చరించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com