Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. రూ.1400 కోట్లతో..
Telangana: దావోస్లో పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఆయన టీమ్ దూసుకుపోతోంది. తాజాగా తెలంగాణకు మరో భారీ పెట్టుబడి దక్కింది. రాష్ట్రంలో 14వందల కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు హ్యుందాయ్ కంపెనీ ప్రకటించింది. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్లో తెలంగాణ పెవిలియన్లో మంత్రి కేటీఆర్తో హ్యుందాయ్ సీఐఓ యాంగ్ చోచి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారీ పెట్టుబడికి సంబంధించిన ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ క్లస్టర్లో పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు.
హ్యుందాయ్ రాకతో తెలంగాణకు మొబిలిటీ రంగంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో కేవలం పెట్టుబడి పెట్టడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మొబిలిటీ వ్యాలీలో కూడా భాగస్వామిగా ఉండేందుకు హ్యుందాయ్ సంస్థ అంగీకరించింది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ఉన్న ఇతర అవకాశాలపైనా కేటీఆర్తో యాంగ్-చో-చి చర్చించారు. తెలంగాణలో పెట్టనున్న పెట్టుబడులతో కంపెనీ టెస్ట్ ట్రాక్లతో పాటు ఎకో సిస్టమ్కు అవసరమైన ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com