తెలంగాణలో కైటెక్స్ గ్రూప్ రూ. 2,400 కోట్ల పెట్టుబడి

కేరళకు చెందిన వస్త్ర పరిశ్రమ కైటెక్స్ గ్రూప్ తెలంగాణలో భారీ పెట్టుబడి పెడుతోంది. వరంగల్లోని కాకతీయ టెక్స్టైల్స్ పార్క్లో, అలాగే రంగారెడ్డి జిల్లా చందన్వెల్లి సీతారామ్పూర్లో ప్లాంటు ఏర్పాటుకు కైటెక్స్ సిద్ధమైంది. ఈమేరకు రాష్ట్రప్రభుత్వం, కైటెక్స్ గ్రూప్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు... కైటెక్స్ గ్రూప్ ఎండీ సాబూ ఎం జాకబ్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన కైటెక్స్కు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. 2 వేల 400 కోట్లు పెట్టుబడులు పెట్టాలని కైటెక్స్ గ్రూప్ నిర్ణయించడం ఆనందదాయకమన్నారు. దీంతో 22 వేల మందికి ప్రత్యేక్ష ఉపాధి, మరో 18 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుందని తెలిపారు. కైటెక్స్ పరిశ్రమలో 85 నుంచి 90 శాతం మంది మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. లక్షల ఎకరాల్లో పండే పత్తిని కైటెక్స్ కొనుగోలు చేయనుందని... సీఎస్ఆర్ కింద ఆరు కోట్లు విలువ చేసే పీపీఈ కిట్లు కైటెక్స్ ఇవ్వనుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com