Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఎప్పుడంటే..?

Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని తెలిపింది. 24గంటల్లో ఇది వాయిగుండంగా మారే అవకాశం ఉందని వివరించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్నారు వాతావరణశాఖ అధికారులు.
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణశాఖ. కొద్దిగంటల్లోనే కుంభవృష్టిలా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రాయలసీమలో జోరు వానలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇప్పటికే కుండపోత వానలతో రాయలసీమ తడిసి ముద్దవుతోంది. డ్యామ్లు నిండుకుండల్లా మారాయి. భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతోంది.
దీంతో 4గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. అటు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇక హైదరాబాద్ లో అయితే కొద్దిరోజులుగా వింత వాతావరణం కనిపిస్తోంది. ఉన్నట్టుండి భారీ వర్షం పడుతోంది. ఆవెంటనే ఎండ వస్తోంది. ఇక భారీ వర్షాల హెచ్చరికలతో లోతట్టు ప్రాంతాల జనం ఆందోళన చెందుతున్నారు. చిన్నపాటి వానకే కాలనీలు ముంపునకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com