Telangana Temperature: తెలంగాణపై భానుడి ప్రతాపం.. ఈ జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక..

Telangana Temperature: తెలంగాణపై భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు నిప్పులు కక్కుతుండడంతో కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. మార్చినెలలోనే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్ దాటాయి. అత్యధికంగా కుమురం భీం జిల్లా కెరిమెరిలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే 2.3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తెలంగాణ ప్రజలు ఎండలతో అల్లాడుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఉదయం 10 దాటితే బయటకెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా చాప్రాల, జైనథ్లో 43.8 డిగ్రీలు... కుమురం భీం జిల్లా కౌతాలలో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భూపాలపల్లి జిల్లా కాటారంలో 43.6, ఆదిలాబాద్లో 43.3, నిజామాబాద్ జిల్లా లక్మాపూర్లో 43.1, పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్లో 43.1, యాదాద్రి జిల్లా వెంక్రియాల్లో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు... నల్గొండ, నిజామాబాద్, రామగుండంలలో 41 డిగ్రీలు... మహబూబ్నగర్, మెదక్లలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హైదరాబాద్ బానుడి భగభగలతో అల్లాడిపోయింది. రానున్న 4 రోజుల పాటు ఎండలు మరింత పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని తెలిపింది. రానున్న రెండు రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.
దీన్ని ప్రభావంతో వచ్చే వారంలో చెడుగొట్టు వానలు కురుస్తాయని వెల్లడించింది. ఈ ఏడాది పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుతాయని అంచనా వేసింది. మార్చి చివరి వారంలోనే ఈ విధంగా ఎండలు దంచి కొడుతుండడంతో ఏప్రిల్, మేనెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాతావారణ శాఖ హెచ్చరికలు, పెరుగుతున్న ఎండలతో తెలంగాణ విద్యాశాఖ అప్రమత్తమైంది.
బడివేళలు తగ్గించాలని నిర్ణయించింది. నేటి నుంచి ఉదయం పదకొండున్నర గంటల వరకే విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో పాఠశాలలు ఉదయం ఎనిమిది నుంచి పదకొండున్నర వరకు పాఠశాలలు పనిచేస్తాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. కుదించిన వేళలు ఏప్రిల్ 6 వరకు కొనసాగించాలని పేర్కొంది.
తెలంగాణలో ఎండల తీవ్రత నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సోమేశ్కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎండల ప్రభావంతో కలిగే ప్రమాదాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్యం చేయాలని, అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అగ్నిమాపక శాఖను అప్రమత్తం చేయాలని కలెక్టర్లకు సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com