Hyderabad: గ్రేటర్ హైదరాబాద్లో అతి పెద్దదైన స్టీల్ బ్రిడ్జి

గ్రేటర్లో అతి పెద్దదైన స్టీల్ వంతెన అందుబాటులోకి రానుంది. ఈ స్టీల్ బ్రిడ్జిని రేపు మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. తెలంగాణ తొలి హోంమంత్రిగా పని చేసిన స్వర్గీయ నాయిని నర్సింహారెడ్డి పేరును ఈ వంతెనకు పెట్టింది కేసీఆర్ సర్కారు. ముషీరాబాద్ ఎమ్మెల్యేగా నాయిని నర్సింహారెడ్డి పని చేశారు. అంతేకాకుండా దశాబ్దాల పాటు వీఎస్టీ కార్మిక సంఘానికి నాయకత్వం వహించారు. దీంతో ఈ బ్రిడ్జ్కు ఆయన పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు.
ఇందిరాపార్కు నుంచి VST వరకు నాలుగు చౌరస్తా మీదుగా 2.81 కి.మీల మేర 450 కోట్లతో ఈ స్టీల్ వంతెన నిర్మించారు. ఈ వంతెన నిర్మాణంలో 12 వేల 500 మెట్రిక్ టన్నుల ప్రత్యేక అలాయ్ స్టీల్, 20 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించారు. స్టీల్ను ఉక్రెయిన్ నుంచి తీసుకువచ్చారు. వంతెనలో మొత్తం 81 స్టీల్ పిల్లర్లు, 46 పైల్ ఫౌండేషన్లు ఉన్నాయి. నాలుగు లేన్లుగా నిర్మించిన దీనిలో 426 గర్డర్లు ఉన్నాయి. సాధారణ కాంక్రీట్ వంతెనలతో పోలిస్తే స్టీల్ వంతెన నిర్మాణానికి 30 శాతం అదనపువ్యయమైందంటున్నారు ఇంజనీరింగ్ అధికారులు. సాధారణంగా VST నుంచి ఇందిరాపార్కుకు రావడానికి దాదాపు 20 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు ఐదు నిమిషాల్లో చేరుకోవచ్చు.
ఆర్టీసీ క్రాస్ రోడ్ చౌరస్తాలో మెట్రో కారిడార్ మీదుగా 26.54 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించడం విశేషం. నగరంలో ఇప్పటి వరకు వంతెనల మీదుగా మెట్రో కారిడార్ ఉండగా.. ఇక్కడ మాత్రమే మెట్రో కారిడార్పై వంతెన నిర్మాణం జరిగింది. బయో డైవర్సిటీ తరహాలో రెండో లెవల్లో ఆర్టీసీ క్రాస్రోడ్ వద్ద స్టీల్ బ్రిడ్జి ఉంటుంది. ఎస్ఆర్డీపీలో పూర్తయిన వంతెనల్లో ఇది 20వది కాగా.. మొత్తం 47 పనులకుగాను 36 అందుబాటులోకి వచ్చినట్టవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com