Inter Results: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫస్టియర్ ఫలితాలపై ప్రభుత్వం పునరాలోచన..

Inter Results: తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాల వ్యవహారం దుమారం రేపుతూనే ఉంది. కరోనా లాంటి కఠిన సమయాల్లో నిర్వహించిన పరీక్షల్లో.. 51శాతం మంది విద్యార్థులను ఫెయిల్ చేయడంపై.. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు.. విద్యార్థి సంఘాలు, విపక్షాలు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఇప్పుడు రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తోంది.
దీనిపై తీవ్రంగా స్పందించిన విద్యార్థి సంఘాలు.. ఇప్పటికే విద్యాశాఖ, ఇంటర్బోర్డ్పై పోరాటాలకు దిగాయి. విద్యార్థుల చావులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని గళమెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై తెలంగాణ ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. విద్యార్థుల ఆత్మహత్యలు, విద్యార్థి సంఘాల వ్యతిరేకత నేపథ్యంలో.. విద్యార్థులు అందరినీ పాస్ చేసే దిశగా అడుగులు వేస్తోంది.
ఫెయిల్ అయిన విద్యార్థులకు.. 35 కనీస మార్కులు వేసే విషయాన్ని పరిశీలిస్తోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో ప్రకటన చేసే అవకాశం ఉంది. 4లక్షల 59వేల 242మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 2లక్షల 35వేల 230మంది మాత్రమే ఫాస్ అయ్యారు. పాస్ అయిన 49శాతం మంది విద్యార్థుల్లో కూడా.. కేవలం 25శాతం మంది విద్యార్థులు మాత్రమే 75శాతానికి పైగా మార్కులు సాధించారు.
ఫెయిల్ విద్యార్థుల్లో ఎక్కువ మంది 5నుంచి 10 శాతం మార్కులు మాత్రమే సాధించారు. ఆన్లైన్ క్లాస్ ద్వారా విద్యార్థులకు సరైన బోధన జరగకపోవడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి విద్యార్థులు అందరినీ ఇంటర్కు ప్రమోట్ చేయడం మరో కారణం అయ్యి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
దీంతో ప్రస్తుతం ఫెయిల్ అయిన విద్యార్థులు అందరినీ.. కనీస మార్కులతో పాస్ చేయడం తప్ప.. మరో మార్గం లేదనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. నష్టం జరిగాక పనరాలోచన చేయడం ఏంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇంటర్ ఫలితాల్లో గందగోళానికి ప్రభుత్వానిదే బాధ్యత అని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి విమర్శించారు. 2019లో 23మంది విద్యార్థులు చనిపోయారని.. దాని నుంచైనా పాఠాలు నేర్వరా అని ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com