TG: తెలంగాణలో ఐటీ నాలెడ్జ్ హబ్

తెలంగాణ కాంగ్రెస్ కొత్త పాలనలో టెక్ రంగం దూసుకుపోతోంది. హైదరాబాద్ నగరానికి మరో ఐటీ హబ్ గర్వకారణం కానుంది. పుప్పాలగూడ పరిసరాల్లో ఏకంగా 450 ఎకరాల్లో "ఐటీ నాలెడ్జ్ హబ్" ఏర్పాటుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పచ్చజెండా ఊపారు. ఇది అమలు అయితే, రాష్ట్ర ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకనుందని మంత్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వివరాలపై సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు ప్రణాళికలు, భూకేటాయింపు, మౌలిక వసతుల కల్పనపై సుదీర్ఘంగా చర్చించారు.
ఉపాధి సృష్టి లక్ష్యంగా ముందుకు
ఈ హబ్ ద్వారా దాదాపు 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రులు వివరించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా, తెలంగాణను దేశంలోనే ఐటీ రంగంలో ముందంజలో ఉంచే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోంది.
ఏఐ టెక్నాలజీతో ముందుకు
ఐటీ నాలెడ్జ్ హబ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, బిగ్ డేటా వంటి ఆధునిక టెక్నాలజీలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రుల సబ్ కమిటీ నిర్ణయించింది. నూతన స్టార్టప్లకు మద్దతుగా ప్రత్యేక విధానాలు రూపొందించనున్నట్టు తెలుస్తోంది. ఈ 450 ఎకరాల్లో 200 ఎకరాల భూమిని గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్లు, రెవెన్యూ, పోలీస్ సొసైటీలకు కేటాయించినట్టు తెలిపారు. మిగతా 250 ఎకరాల భూమిని కలిపి ఐటీ నాలెడ్జ్ హబ్ కోసం వినియోగించనున్నట్టు స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com