JANASENA: ప్రజా సమస్యలపై గొంతెత్తుదాం

జనసేన పార్టీ శాసనసభ సభ్యులకు... ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ‘అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జనసేన పార్టీ సామాన్యుడి గొంతుగా ఉండాలని, ప్రజల సమస్యలను, ఆకాంక్షలను, ఆశలను, సంక్షేమాన్ని, చట్టసభల్లో వినిపించేలా పార్టీ తరఫున ఎన్నికైన ప్రతి శాసనసభ్యుడు, శాసనమండలి సభ్యులు చర్చల్లో పాల్గొనాలి" అని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు పవన్ దిశానిర్దేశం చేశారు. బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి మొదలవుతున్న తరుణంలో జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. పార్టీ పీఏసీ ఛైర్మన్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వాగతోపన్యాసం చేస్తూ.. బడ్జెట్ సమావేశాల్లో పార్టీ విధివిధానాలు అనుసరించి చర్చల్లో బలంగా పాల్గొనాలని, పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంలో ముందుకు వెళ్లాలని సూచించారు.
రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు...
వైసీపీ సభ్యులు అసెంబ్లీలో అసభ్య పదజాలంతో రెచ్చగొట్టినా.. జనసేన సభ్యులు సంయమనం కోల్పోవద్దని పవన్ సూచించారు. చట్ట సభల్లో హుందాగా వ్యవహరించాలని... బురదలో కూరుకుపోయిన వైసీపీ సభ్యులు దాన్ని మనకూ అంటించాలని చూస్తారని పవన్ అన్నారు. గతంలో చట్టసభల్లో వాళ్ల భాష, విధానం ప్రజలంతా గమనించారని పవన్కల్యాణ్ తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. శాసనసభ సంప్రదాయాన్ని, మర్యాదను కాపాడుతూ హుందాగా ముందుకు వెళ్దామని ప్రజా ప్రతినిధులకు పవన్ సూచించారు. చట్ట సభలలో ఎంత విలువైన చర్చలు జరిగేవో ఒకసారి అందరూ పరిశీలించాలని సూచించారు. ఎప్పటికప్పుడు సమస్యలపై పూర్తి అవగాహన పెంచుకొని చర్చల్లో పాల్గోవాలని సూచించారు.
బడ్జెట్పై అధ్యయనం చేయాలి
జనసేన సభ్యులంతా బడ్జెట్ను అధ్యయనం చేయాలని పవన్ సూచించారు. ప్రభుత్వ రాబడులు, ఖర్చులు, శాఖలవారీగా కేటాయింపులు, అప్పులు, ఇతరత్రా అంశాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. బడ్జెట్ పద్దులపై జరిగే చర్చల్లో పాల్గొనాలని పవన్ సూచించారు. సభ్యులు వారికి ఏయే శాఖలపై అవగాహన, ఆసక్తి ఉన్నాయో వాటి ఆధారంగా చర్చల్లో మాట్లాడాలన్నారు. నియోజకవర్గంలోని ప్రజాసమస్యలు తెలుసుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆ తరహా సమస్యలు ఉంటే వాటన్నింటినీ క్రోడీకరించి మాట్లాడాలని పవన్ సూచించారు. ఫలితంగా ప్రతి సభ్యుడి గొంతు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ అర్థమవుతుందని.... శాసన సభ్యులు, మండలి సభ్యులకు పవన్ సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com