MISS: చిక్కినట్లే చిక్కి చేజారిన మంత్రి పదవి

MISS: చిక్కినట్లే చిక్కి చేజారిన మంత్రి పదవి
X
కవ్వంపల్లి సత్యనారాయణ ఆశలపై నీళ్లు... తీవ్ర నిరాశలో అభిమానులు

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉత్కంఠకు తెరపడింది. చాలా కాలంగా మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు వినిపిస్తుండగా.. తాజాగా కాంగ్రెస్ అదిష్టానం... ముగ్గురు ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకుంది. ప్రస్తుతం ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా.. ఈ దఫా ముగ్గురికి ఛాన్స్ ఇచ్చారు. దీంతో రేవంత్ జట్టులోకి ముగ్గురు కొత్త మంత్రులు చేరనున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి (ఎస్సీ - మాల), ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ఎస్సీ - మాదిగ), మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ (బీసీ - ముదిరాజ్)లను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ ముగ్గురు కూడా తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రి పదవులు దక్కించుకున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్‌గా లంబాడా సామాడిక వర్గానికి చెందిన రామచంద్రు నాయక్‌ పేరు ఖరారు చేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ ఎమ్మెల్యేకు చిక్కినట్లే చిక్కి మంత్రి పదవి చేజారింది. అప్పటి వరకు ఆయన పేరు ప్రముఖంగా వినిపించినా చివరి నిమిషంలో మంత్రి పదవి మిస్ అయింది.

నిరాశలో కవ్వంపల్లి

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి మంత్రి పదవి కోసం తీవ్ర పోటీ నెలకొనగా.. రేసులో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్ పేర్లు తెరపైకి వచ్చాయి. కవ్వంపల్లికే మంత్రి పదవి ఖాయమని దాదాపుగా డిసైడ్ అయ్యారు.అయితే చివరి నిమిషంలో కవ్వంపల్లిని కాదని.. అడ్లూరిని ఎంపిక చేశారు. దీంతో కవ్వంపల్లి సత్యనారాయణ వర్గీయులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. నిన్నటి నుండి కవ్వంపల్లికి మంత్రి పదవి ఖరారైనట్లు జోరుగా ప్రచారం జరగ్గా.. నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. చివరి క్షణంలో మంత్రి పదవి చేజారడంతో కవ్వంపల్లి సత్యనారాయణ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. పార్టీలో అంతర్గత అంశాలను పరిగణనలోకి తీసుకుని చివరి నిమిషంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.

Tags

Next Story