Karimnagar : కరీంనగర్ జిల్లాలో ఘోర ప్రమాదం.. టిప్పర్ బోల్తా..

కరీంనగర్ జిల్లా హుజారాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. మట్టితో అతివేగంగా వెళ్తున్న టిప్పర్ మూలమలుపు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది.ఈ రోడ్డు ప్రమాదం రెండు కుటుం బాల్లో విషాదం నింపింది. ఆ కుటుంబాలకు తీరని వేదన మిగిల్చింది. అతి వేగంగా ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. మొరం లోడ్తో వెళ్తున్న టిప్పర్ లారీ మూల మలువు వద్ద అదువు తప్పి బోల్తా పడటంతో ఓకే కుటుంబానికి చెందిన అన్నా చెల్లెలు, మరో అమ్మాయి మృతి చెందారు. ముగ్గురు మొరం కింద పడి మృత్యువాత పడ్డారు.
బోర్నపల్లి పరిధిలో పెద్దమ్మ జాతర గత మూడు రోజులుగా జరుగుతోంది. జాతరలో పాల్గొన్న అనా చెల్లెలు గంట విజయ్(17), గంట వర్ష (15), మరో అమ్మాయి సింధూజ (18) ముగ్గురు గుడి నుంచి ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో సైదాపూర్ మండలం గొడిశాల నుంచి నేషనల్ హై వే నిర్మాణం కోసం టిప్పర్ లారీ మొరం తరలిస్తోంది. బోర్నపల్లిలో భూ లక్ష్మీ దగ్గర మూల మలువు వద్ద అదుపు తప్పిన లారీ బైక్పై వెళ్తున్న వారిపై బోల్తా పడింది. దీంతో ముగ్గురు మొరం కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు పిల్లలూ ఒకేసారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
కుటుంబ సభ్యులు. బంధువులంతా సంఘటన స్థలానికి చేరుకోవడంతో వారి రోదనలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. జేసీబీ సాయంతో మొరాన్ని తొలగించి మృతదేహాలను స్థానిక ఏరియా హాస్పిటల్కు తరలించారు. ఓకే కుటుంబానికి చెందిన అన్నా చెల్లెల్లు మృతి చెందడంతో వారి తల్లి షాక్కు గురై ఆసుపత్రి పాలయ్యారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com