Karimnagar: కష్టాలు తీర్చమంటూ రైతులు వాట్సప్ వాయిస్ మెసేజ్..

Karimnagar (tv5news.in)
Karimnagar: రైతులు దేశానికి వెన్నుముక అని నమ్మే దేశం మనది. కానీ అదే రైతుకు కష్టం వస్తే ఆదుకోలేని నిస్సహాయత కూడా మనదే. ప్రస్తుతం మారిన పర్యావరణ పరిస్థితులకు ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఎండలు మండిపోతాయో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. వీటన్నింటిన అధిగమించి ఓ రైతు పంట పండిస్తే కనీసం దాన్ని కొనుగోలు చేయడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు.
ధాన్యం కొనుగోలు విషయం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఖరీఫ్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. దీంతో వారు కొనుగోలు కేంద్రాల వద్దే రాత్రి, పగలు తేడా లేకుండా గడిపేస్తున్నారు. అకాల వర్షాలు వారి ధాన్యాన్ని తడిపేస్తుంటే ఏం చేయాలో తెలియని నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు. అందుకే వారంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు.
కరీంనగర్ జిల్లాలోని రైతులు తమ కష్టాలను వాట్సాప్ వాయిస్ మెసేజ్ల ద్వారా తెలియజేస్తున్నారు. అది వైరల్ అయ్యి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దగ్గరకు చేరాలన్నదే వారి ఆశ. ఖరీఫ్ పోయి రబీ కూడా వచ్చేస్తుందని కానీ ఖరీఫ్లోని పంటల వల్ల వారికి నష్టం తప్ప లాభం ఏమీ కలగలేదని ఈ వాయస్ మెసేజ్లో పేర్కొన్నారు.
ఖరీఫ్కే ఇలా ఉంటే రబీకి వారు పంటలు పండించే ధైర్యం ఎలా చేస్తారని రైతులు వాపోయారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని కొనుగోలు కేంద్రాల బయట పడి ఉన్న ధాన్యాన్ని అమ్మేలా చూసుకోవాలని కోరారు. వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని అధికారులు కారణాలు చెప్తున్నారని అన్నారు. ఈ వాయిస్ మెసేజ్ వ్యవసాయ శాఖ మంత్రి వరకు వెళ్తుందన్న నమ్మకంతో వారు చేసిన ఈ ప్రయత్నం ఫలిస్తుందో లేదో..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com