BRS: బీఆర్ఎస్ చేవేళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్!

బీఆర్ఎస్ తరపున చేవెళ్ల లోక్ సభ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ పేరు ఖరారైనట్లు తెలిసింది చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని నేతలతో సమావేశమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్ సభ ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థిత్వంపై చర్చించారు. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవడంతో ప్రత్యామ్నాయాలపై కేసీఆర్ చర్చించారు. కొన్ని వ్యక్తిగత, ఇతర కారణాలవల్లే రంజిత్ రెడ్డి ఎన్నికలకు దూరంగా ఉంటున్నారని,ఆయన బీఆర్ఎస్లోనే కొనసాగుతారని కేసీఆర్ వివరించినట్లు తెలిసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు లోక్ సభ నియోజకవర్గాలపై కూడా KCRదిశానిర్ధేశం చేశారు. లోక్ సభ టికెట్ ఆశించి ఆ తర్వాత వెనక్కి తగ్గిన శాసనసభ స్పీకర్ గుత్తాసుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి భేటీకి హాజరుకాలేదు. ఆశాహవ అభ్యర్థులపై ఆరాతీసిన కేసీఆర్ అభ్యర్థులకు సంబంధించిన అన్ని అంశాలను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి చెప్పినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం పార్టీకి మెజార్టీ ఉందని,లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధిస్తామని KCR ధీమా వ్యక్తం చేసినట్లు సమాచారం.
కరీంనగర్ వేదికగా జరగబోయే బీఆర్ఎస్ కదనభేరికి భారీగా కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలిరావాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ నెల 12న సాయంత్రం 4 గంటల సమయంలో ఎస్ఆర్ఆర్ మైదానం నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటింది. మేడిగడ్డలో మూడు పిల్లర్లు కుంగి.. మూడు నెలలు గడుస్తున్నా.. ఇంకా పనులు మొదలు పెట్టలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ జెండా గెలిచి ఉంటే, కేసీఆర్ సీఎం అయి ఉంటే.. మేడిగడ్డలో కుంగిన పిల్లర్ల వద్ద పనులు మొదలు పెట్టి.. పూర్తి చేసేవారు. మిడ్ మానేరు, ఎల్ఎండీ నింపుకుని పంట పొలాలకు నీళ్లు ఇచ్చేవాళ్లం. తెలంగాణ గుండెతోని ఆలోచిస్తేనే తెలంగాణ సమస్యలు అర్థమవుతాయి. ప్రజలకు ఏది అత్యవసరం అనేది ఆలోచించాలి. పంట పొలాలు ఎడిపోతుంటే రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కొంతమంది రైతులు ఎండిపోతున్న పంటకు నిప్పు పెడుతున్నారని తెలిసింది. ఏడుపు వస్తున్నది. ఎందుకు ఈ తెలంగాణకు గోస. కేసీఆర్ ఉంటే అడ్డు పడైనా నీళ్లు తీసుకోచ్చేవారని రైతులు అంటున్నారని వినోద్ కుమార్ తెలిపారు.
ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో కేసీఆర్ 14 ఏళ్లు పోరాడి తెలంగాణను సాధించారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. తూప్రాన్ మండల్ వెంకటాయపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. శివాజీ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా జీవించేవని.. మత సామరస్యానికి ప్రతీక శివాజీ అన్నారు. ఆయన ఏ ఒక్క వర్గానికో పరిమితమైన వ్యక్తి కాడని.. ఆయన సైన్యంలో కీలక స్థానాల్లో ముస్లింలు పని చేశారన్నారు. కొందరు శివాజీని ఓట్ల కోసం వాడుకుంటూ ఉంటున్నారన్నారు. ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో కేసీఆర్ 14 ఏళ్లు పోరాడి తెలంగాణను సాధించారని.. కేసీఆర్ శివాజీ బాటలో పది సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించారన్నారు. మూడు నెలల కాంగ్రెస్ పాలన చూస్తున్నామని.. ఎన్నెన్నో హామీలుయిచ్చారని.. వాటి అమలుపై శ్రద్ధ చూడం లేదన్నారు. రైతులు సమస్యలతో అల్లాడుతున్నారని.. పొలాలకు నీరందక రైతాంగం రోజంతా పరేషాన్లో ఉన్నారన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com