KCR: బందిపోట్లను తలపిస్తున్న రేవంత్ పాలన

KCR: బందిపోట్లను తలపిస్తున్న రేవంత్ పాలన
X
బుల్డోజర్లు రంగంలోకి దింపి విధ్వంసం చేస్తారా.. హెచ్‌సీయూ వివాదంపై కేసీఆర్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీరు బందిపోట్లను తలపిస్తోందని మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు వ్యాఖ్యానించారు. వందలాది బుల్డో జర్లను రంగంలోకి దించి యూనివర్సిటీ భూమిలో విధ్వంసానికి పాల్పడటం రేవంత్‌ మనస్తత్వానికి అద్దంపడుతోందని విమర్శించారు. రేవంత్‌ దూకుడుతో ప్రజలు తప్పు పడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పతనం దిశగా వేగంగా పయనిస్తోందని, దానిని ఎవరూ రక్షించలేరని కేసీఆర్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదని తెలుసుకునే సీఎంతోపాటు మంత్రులు వీలైనంత త్వరగా సొంత జేబులు నింపుకొనేందుకు పోటీ పడుతున్నారని ఆరోపించారు. ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వ పతనానికి దారితీస్తుందని చెప్పారు. బుధవారం ఎర్రవల్లి నివాసంలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలతో కేసీఆర్‌ భేటీ అయ్యారు.

రజతోత్సవానికి సిద్ధం కండి

ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్‌ రజతోత్సవ మహాసభకు బీఆర్ఎస్‌ శ్రేణులు సిద్ధం అవుతున్నాయి. ఈ మహాసభకు శ్రేణులను సిద్ధం చేయాలని పార్టీ నేతలను ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ఇప్పటికే ఆదేశించారు. ఈ నెల 27న జరగనున్న ఆదేశించారు. సభ నిర్వహణ, ఏర్పాట్లపై పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చాలా త్వరగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుందని కేసీఆర్ అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని కేసీఆర్ అన్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి బహిరంగ సభకు ప్రజలు తరలివచ్చేలా ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ ఆదేశించారు.

మేలో బీఆర్ఎస్‌ సభ్యత్వ నమోదు

మే నెలలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించనుమంది. ఈ విషయాన్ని పార్టీ అధినేత కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. జూన్, జులైలో జిల్లా కమిటీలు, అక్టోబరులో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకుందామని... పార్టీని మరింత పటిష్ఠపరిచే దిశగా కార్యాచరణ అమలు చేద్దామని కేసీఆర్ అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత పటిష్టం చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు.

Tags

Next Story