Telangana: తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధింపుపై నిర్ణయం నేడే..

Telangana: ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యుహాలపై చర్చ జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజూ 2వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
వ్యాప్తి రేటు కూడా పెరుగుతోంది. ప్రస్తుతం 3.50 శాతం పాజిటివ్ రేటు ఉంది. సంక్రాంతి పండుగ అనంతరం కేసులు భారీగా పెరుగుతాయని వైద్యశాఖ అంచనా వేసినట్లుగానే కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ కేబినెట్ భేటీలో.. కొవిడ్ కట్టడికి ఇప్పటివరకు తీసుకుంటున్న చర్యలు, ఇంకా ఏం చేయాలన్న అంశాలపై చర్చించనున్నారు.
రాత్రిపూట కర్ఫ్యూ విధించే అంశాన్నీ ఈ కేబినెట్ భేటీలో పరిశీలించే అవకాశాలున్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరోవైపు ఉద్యోగుల విభజన అంశం కొలిక్కి రావడంతో ఉద్యోగ ఖాళీల వివరాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక వ్యవసాయ పరంగా యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో ఎరువుల ధరలు బాగా పెరిగాయి. ఈ ధరలను తగ్గించే విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేలా కార్యాచరణ చేపట్టే అవకాశాలున్నాయని అధికార పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై కూడా కేబినెట్లో చర్చించనున్నట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com