TG: మేడిగడ్డ వద్ద ఆనకట్ట నిర్మించాలన్న సూచన కేసీఆర్దే!

ఆనకట్ట నిర్మాణానికి మేడిగడ్డ అనువైన స్థలంగా అప్పటి ముఖ్యమంత్రి సూచించారని విశ్రాంత ఇంజనీర్లు విచారణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ముందు చెప్పినట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ విశ్రాంత ఇంజనీర్లతో సమావేశమయ్యారు. 2015 లో గోదావరి జలాలపై తాము ఇచ్చిన నివేదిక, సంబంధిత అంశాలను విశ్రాంత ఇంజనీర్ల కమిటీ సభ్యులు కమిషన్ కు వివరించారు. ప్రాణహిత-చేవెళ్ల, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు, గోదావరి జలాల లభ్యత, కేంద్ర జలసంఘం పరిశీలనలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. తమ నివేదికపై అప్పటి సీఎం, మంత్రి, అధికారులు సంతకాలు చేయలేదని కూడా విశ్రాంత ఇంజనీర్లు పేర్కొన్నట్లు తెలిసింది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణంలో సబ్ కాంట్రాక్టర్ల వ్యవస్థపై దృష్టిసారించిన జస్టిస్ ఘోష్ వారి వివరాలు సేకరిస్తున్నారు. ఆయా నిర్మాణ సంస్థల ఖాతాలు పరిశీలిస్తే.. అన్ని అంశాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు. ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల విచారణ పూర్తైనందున.. అన్ని అఫిడవిట్లు వచ్చిన తర్వాత కమిషన్ తదుపరి కార్యాచరణ చేపట్టనుంది. ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాన్ని కాదని కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును ఎందుకు చేపట్టారనే అంశంపై జస్టిస్ PCఘోష్ కమిషన్ ఆరా తీస్తోంది. గ్రావిటీ ద్వారా నీరు వచ్చే అవకాశం ఉండగా.. భారీ వ్యయంతో ఎత్తిపోతలలు చేపట్టాల్సిన అవసరం, అందుకు కారణాలను అన్వేషిస్తోంది.ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల సహా మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసే అంశంపై... ఐదుగురు సభ్యులతో కూడిన విశ్రాంత ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదిక, దానిపై అప్పటి ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆరా తీస్తోంది. ప్రాణహిత చేవెళ్ల కాదని కాళేశ్వరం చేపట్టడంపై... ఎవరు, ఎందుకు నిర్ణయం తీసుకున్నారో వివరాలు సమర్పించాలని నీటిపారుదలశాఖను కమిషన్ ఆదేశించింది. గోదావరిలో నీరు ఉండగా ప్రాణహిత జలాలను ఎత్తిపోయాల్సిన అవసరమేంటనే అంశంపై.. ఆరా తీస్తోంది.
ఇప్పటికే మధ్యంతర నివేదిక ఇచ్చిన జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని తుది నివేదిక ఇవ్వాలని జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. కాళేశ్వరం ప్లానింగ్పై.. పుణేలోని CWPRSనుంచి కూడా నివేదిక కోరారు. జూలై మొదటి వారంలో.. నివేదికలు వచ్చే అవకాశం ఉండగా విజిలెన్స్ విభాగం నుంచి తుది నివేదిక కోరారు. కాళేశ్వరం బ్యారేజీలపై విచారణ చేపట్టిన జస్టిస్ ఘోష్ ENC జనరల్ కార్యాలయం, ఓ అండ్ ఎం విభాగాల ఇంజనీర్ల నుంచి వివరాలు సేకరించింది. ఇంతటితో ఇంజనీర్లకు సంబంధించి విచారణ దాదాపు పూర్తి కాగా... ఈనెల 27లోపు అన్ని అఫిడవిట్లు వచ్చాక పూర్తిస్థాయిలో విశ్లేషించి తదుపరి కార్యాచరణ చేపట్టనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com