Hyderabad: ఎనిమిదేళ్లలో తెలంగాణ జీవన ముఖచిత్రం ఎంతో మారింది.. వజ్రోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్
Kcr On Vajrostavalau: దేశంలోనూ, రాష్ట్రంలోనూ మతోన్మాదశక్తులు పేట్రేగిపోతున్నాయన్నారు సీఎం కేసీఆర్. తమ సంకుచిత ప్రయోజనాల కోసం సామాజిక సంబంధాల నడుమ ముళ్లకంపలు నాటుతున్నాయని.. విద్వేషపు మంటలు రగిలిస్తూ, విష వ్యాఖ్యలతో ఆజ్యం పోస్తున్నాయన్నారు. మనుషుల మధ్య ఈ రకమైన విభజన ఏ విధంగానూ సమర్థనీయం కాదన్నారు.
మతం చిచ్చు ఈ విధంగానే విజృంభిస్తే అది దేశం, రాష్ట్రం జీవికనే కబళిస్తుందన్నారు. మానవ సంబంధాలనే మంట గలుపుతుందన్నారు. జాతి జీవనాడిని కలుషితం చేస్తుందన్నారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి, తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడలకు.. ఈ విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతున్నాయన్నారు.
ఆనాటి చరిత్రతో, పరిణామాలతో వీసమెత్తు సంబంధంలేని ఈ అవకాశవాదులు, ఆషాడ భూతులు చిల్లర రాజకీయాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్.. జాతీయ జెండా ఆవిష్కరించారు.
ప్రభుత్వ కృషితో పరిశుభ్రమైన పచ్చని పల్లెలు రూపుదిద్దుకున్నాయన్నారు సీఎం కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం అందించే అవార్డులు వరుసపెట్టి తెలంగాణ గ్రామాలను వరించడం మనందరికీ గర్వకారణమన్నారు. అపూర్వమైన ఫలితాలను సాధించిన పల్లె-పట్టణ ప్రగతి కార్యక్రమం యావత్ దేశానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు.
ఎనిమిదేళ్లలో తెలంగాణ జీవన ముఖచిత్రం ఎంతగానో మారిపోయిందని.. సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తూ రాష్ట్రం ప్రగతిబాటలో పయనిస్తుందన్నారు. ఈ తరుణంలో మతతత్వ శక్తులు బయలుదేరి తమ వికృత ప్రయత్నాలతో తెలంగాణ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com