ధరణిలో ఒకసారి భూమి నమోదు అయిందంటే దాన్ని ఎవరూ మార్చలేరు: సీఎం కేసీఆర్

తెలంగాణ ఉద్యమం సిద్దిపేట నుంచే ప్రారంభమైందన్నారు సీఎం కేసీఆర్. తొలి, మలి విడుత ఉద్యమంలో....సిద్ధిపేట అండగా ఉందని గుర్తు చేసుకున్నారు. సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్... పోలీస్ కమిషనరేట్, సమీకృత కలెక్టరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యాక్రమంలో ప్రసంగించారు. సిద్దిపేట జిల్లాలో పుట్టిపెరిగిన తాను తొలి కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకోసం సిద్దిపేట జిల్లా ప్రజలకు హృదయపూర్వక అభినందలు తెలిపారు.
స్వరాష్ట్రం కోసం ఎన్నో కష్టాలు పడ్డామని, సమైక్య పాలనలో నీటి సమస్యతో తెలంగాణ తీవ్ర ఇబ్బందులు పడిందన్నారు. తాగు,సాగునీటి కోసం సిద్దిపేట ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామరన్నారు. ఓ ట్రాన్స్ఫార్మర్ కావాలన్నా పైరవీలు చేసుకోవాల్సిన దుస్థితి ఉండేదన్నారు. ఆ రోజుల్లోబావులు, బోర్లను అద్దెకు తీసుకుని ట్యాంకర్లతో నీటిని అందించామని గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయన్నారు. గత మేనెలలోనూ.. చెరువులు అలుగు పారుతున్నాయన్నారు. వాక్ శుద్ది, చిత్తశుద్ది, లక్ష్య శుద్దితోనే ఇదంతా సాధ్యమైందన్నారు.
సిద్దిపేటకు వెటర్నరీ కాలేజీ మంజూరు చేశారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో నాలుగు వెటర్నరీ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. సిద్దిపేట, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాలో వెటర్నరీ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.పాలన సంస్కరణల్లో భాగంగానే 33 జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు. పాలనా ఫలాలు వేగంగా ప్రజలకు అందాలన్న సదుద్ధేశంతోనే... సంస్కరణలు తెచ్చామన్నారు. అవినీతిని అరికట్టేందుకే నేరుగా రైతులఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నామన్నారు. రైతులకు మంచి జరుగుతుంటే కొందరికి నచ్చడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్రావు, మహమూద్ అలీ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.
తెలంగాణలో మొత్తం 2.75 కోట్ల ఎకరాల భూమి ఉందని, ఇందులో కోటి 65 లక్షల ఎకరాల భూమి రైతుల చేతుల్లో ఉందన్నారు. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఓ రైతు వేదికను ఏర్పాటు చేశామన్నారు. రైతు వేదికల్లో వెంటనే సమావేశాలు ప్రారంభించాలన్నారు. గుజరాత్, తమిళనాడులో పత్తి బాగా పండుతుందని, కానీ అక్కడి పరిశ్రమలు తెలంగాణ పత్తి కొనేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ప్రపంచంలో పండే నాలుగు రకాలైన మేలైన పత్తిలో తెలంగాణలో పండేది ఒకటన్నారు. తెలంగాణ వచ్చే నాటికి 50 జిన్నింగ్ మిల్లులు ఉండగా.. ఇప్పుడా సంఖ్య 400కు పెరిగిందన్నారు.
అవినీతిని అరికట్టేందుకే రైతుల ఖాతాల్లో నేరుగా రైతు బందు డబ్బులు వేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. రైతులకు మంచి జరుగుతుంటే కొందరికి నచ్చడం లేదన్నారు. రైతు బంధు 95 శాతం సద్వినియోగం అవుతోందన్నారు. అన్ని ఆలోచించే రైతు బంధు తీసుకొచ్చామన్నారు. ధరణి కోసమే మూడేళ్లు శ్రమించామని, ఇందులో ఒకసారి భూమి నమోదు అయితే.. దాన్ని ఎవరూ మార్చలేరన్నారు సీఎం కేసీఆర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com