Priyanka Gandhi : ప్రియాంకా గాంధీతో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భేటి.. 40 నిమిషాలపైనే చర్చ..

Priyanka Gandhi : తెలంగాణలో నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ స్పష్టంచేశారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఢిల్లీలో ప్రియాంకా గాంధీతో సమావేశమైన ఆయన.. దాదాపు 40 నిమిషాల పాటు చర్చలు జరిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో ఏవిధంగా పార్టీని పటిష్టం చేయాలి అనే అంశాలపై చర్చించినట్లు వెంకటరెడ్డి తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ప్రియాంకా గాంధీ చెప్పారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి 10 రోజుల తర్వాత యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామని ప్రియాంకాగాంధీ అన్నట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టంచేశారు.
ప్రియాంకాగాంధీతో కోమటిరెడ్డి ప్రత్యేకంగా భేటీ కావడం తెలంగాణలో చర్చనీయాంశమైంది. రెండ్రోజుల క్రితం పీసీసీ ముఖ్య నేతలతో కాంగ్రెస్ హైకమాండ్ జరిపిన సమావేశానికి వెంకటరెడ్డి హాజరు కాలేదు. అదే రోజు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాకూర్ తీరుపై ఆయన పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాసారు. ఆ తర్వాత ప్రియాంకాగాంధీ నుంచి పిలుపు రావడంతో ఢిల్లీ వెళ్లిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్తో ఆమెను కలిసారు. తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి ప్రియాంకాగాంధీ కీలక సలహాలు, సూచనలు చేసినట్లు వెంకటరెడ్డి తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com