KRMB: ఎట్టకేలకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ కమిటీ భేటీ..

KRMB: హైదరాబాద్ జలసౌధాలో... కృష్ణా రివర్ మేనేజ్మెంట్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశం ఐదు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే... ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ భేటీ కావాలని కమిటీ నిర్ణయించడంతో... ఈ సమావేశం ప్రారంబమైంది. బోర్డు అధికారి రవికుమార్ పిళ్లై నేతృత్వంలో ఈ సమావేశం జరిగుతోంది.
ఈ సమావేశానికి.. ఇరు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. ఆఖరి సమావేశం కావడంతో.. ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనుంది కమిటీ. ఈ సమావేశంలో ప్రధానంగా మూడు అంశాలపై చర్చ జరగనుంది. పవర్ హౌస్ల నిర్వహణ, వరద నీటి వినియోగం, రిజర్వాయర్ల నిర్వహణ అంశాలపై చర్చించనున్నారు.
కృష్ణా నదీ యాజమాన్యబోర్డులో కీలక అధికారి రవికుమార్ పిళ్లై నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో రెండు రాష్ట్రాల నీటిపారుదల, జెన్కో చీఫ్ ఇంజినీర్లు సభ్యులుగా ఉన్నారు. పవర్హౌస్ల నిర్వహణ, వరద నీటి వినియోగం, రిజర్వాయర్ల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించి ఓ నిర్ణయం తీసుకొనేందుకు ఆరు నెలల క్రితం బోర్డు ఈ కమిటీని ఏర్పాటు చేసింది.
ఇప్పటివరకు అయిదు సమావేశాలు జరగ్గా ఇవాళ్టి సమావేశం ఆరోది. కమిటీకి నేతృత్వం వహిస్తున్న పిళ్లై.. సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఇప్పటికే రెండు రాష్ట్రాల అధికారులకు పంపారు.
అటు జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండి గేట్లు ఎత్తినపుడు తీసుకొనే నీటిని మిగులు జలాలుగా పరిగణిస్తున్నారు. వీటిని వివిధ రిజర్వాయర్లకు మళ్లించవచ్చు. ఈ నీటిని ఏ రాష్ట్రం ఎంత మళ్లించిందీ లెక్కల్లోకి తీసుకొంటారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్లో పవర్హౌస్ల నిర్వహణపై కూడా పలు కీలక ప్రతిపాదనలు ఈ ముసాయిదాలో పొందుపర్చారు. దిగువన సాగు, తాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకొని శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేయాలని ప్రతిపాదించింది రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com