BRS: కేటీఆర్కు నోటీసులు... రేవంత్ కుట్ర

కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు మాట్లాడుతూ.. ఇది రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రగా అభివర్ణించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభద్రతాభావంతో ఉందని.. అందుకే కేటీఆర్కు నోటీసులు ఇచ్చిందని మండిపడ్డారు. ఇలాంటి దొంగ కేసులు కోర్టు ముందు తేలిపోతాయని.. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఈ కేసు విషయంలో కేటీఆర్ వెంట బీఆర్ఎస్ శ్రేణులు ఉంటాయని.. నిజం త్వరలోనే బయటపడుతుందని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.**
స్పందించిన ఎమ్మెల్సీ కవిత
ఎమ్మెల్సీ కవిత కూడా కేటీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని ఖండించారు. తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ నోటీసులు జారీ చేసిందని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఈ నోటీసులు జారీ అయినట్లు స్పష్టమవుతోందన్నారు. తమ పార్టీ నాయకులకు వరుసగా నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం స్పష్టంగా ఉందని కవిత తేటతెల్లం చేశారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా.. కేసీఆర్ సైనికులు తట్టుకొని నిలబడ్డ చరిత్ర ఉందని ఆమె అన్నారు. ఇటీవల పార్టీలో పరిణామాలపై అసంతృప్తిగా ఉన్నారంటూ ప్రచారం జరిగిన కవిత, ఈ కేసుపై స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కాంగ్రెస్పై కేటీఆర్ తీవ్ర విమర్శలు
కాంగ్రెస్ను ఎన్ని రోజులు భరించాలని ప్రజలు అంటున్నారని, ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం కాంగ్రెస్ ఇచ్చిన అభయహస్తం హామీ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఒక పక్క రాష్ట్రానికి అప్పులు పుట్టడం లేదంటూనే.. మరో పక్కన తెలంగాణ రైజింగ్ అని చెప్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మూటల మనిషి అని మరోసారి రుజువైందన్నారు. సీఎం చేస్తున్న, మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆయన మానసిక పరిస్థితిపై అనుమానం కలుగుతోందన్నారు. నిందలు, చందాలు, దందాలే కాంగ్రెస్ ప్రభుత్వ తీరని, రేవంత్ ఢిల్లీకి మూటలు మోస్తున్నారని దుయ్యబట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com