మూడురోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయి : కేటీఆర్

భారీవర్షాలు, వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. ఇంకా మూడు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అన్ని పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహాయక సిబ్బంది అలర్ట్గా ఉన్నారన్నారు. ఇందుకోసం స్పెషల్ ఆఫీసర్స్ ను నియమించినట్లు కేటీఆర్ తెలిపారు. వరదల్లో చిక్కుకున్న వేలాది మందిని పునరావాస ప్రాంతాలకు తరలించి, 37 వేల రేషన్ కిట్లు అందించామన్నారు. రాష్ట్రంలో 670 కోట్ల నష్టం వాటిల్లినట్లు మంత్రి తెలియజేశారు. జీహెచ్ ఎంసీ పరిధిలో ఇప్పటివరకు 33మంది వరదల కారణంగా మరణించినట్లు వెల్లడించారు.
నగరంలో 3 చెరువులు తెగాయని, అందుకే తీవ్ర నష్టం జరిగినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వరదల్లో చిక్కుకున్నవాళ్లను రక్షించేందుకు జీహెచ్ ఎంసీ వద్ద 18 బోట్లు ఉన్నాయని, ఏపీ, కర్ణాటకనుంచి మరో 30 బోట్లు తెప్పించినట్లు తెలిపారు. అవసరమైతే ఆర్మీసహాయం తీసుకుంటామన్నారు. వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు హెలికాప్టర్లను కూడా సిద్దంచేసినట్లు మంత్రి స్పష్టంచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో లోతట్టుప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com