KTR: నీట్‌ పరీక్షపై మోదీ స్పందించరేం..?

KTR: నీట్‌ పరీక్షపై మోదీ స్పందించరేం..?
X
కేంద్రానికి ఘాటు లేఖ రాసిన కేటీఆర్‌... చర్యల్లో జాప్యం ఎందుకని ప్రశ్నాస్త్రాలు

నీట్ యూజీ ప్రవేశపరీక్ష వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డ బీఆర్‌ఎస్‌ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్... లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులను వెంటనే శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో కేటీఆర్ కోరారు. కష్టపడి చదివే తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలపై గందరగోళంగా మారిన నీట్ పరీక్షా వ్యవహారం నీళ్లు చల్లిందన్న ఆయన... ఓవైపు బీహార్ లో 30 లక్షల చొప్పున నీట్ ప్రశ్నాపత్రాలు విక్రయించారని, ఇప్పటికే పదుల సంఖ్యలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలొస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. నీట్ పరీక్ష వ్యవహారంలో కేంద్రం ఆది నుంచి అత్యంత నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందని విమర్శించారు.


ఇన్ని ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ మోదీ సర్కార్ ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమని మండిపడిన కేటీఆర్.... విద్యార్థులతో పరీక్షాపే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని, కీలకమైన నీట్ పరీక్షపై మాత్రం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నీట్ ఎగ్జామ్ లో ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావటం ఎన్నోరకాల అనుమానాలకు తావిస్తోందని... ఒకే సెంటర్ నుంచి ఎనిమిది మంది విద్యార్థులు ఏకంగా 720 మార్కులు సాధించడం చూస్తే, పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోందని ఆయన తెలిపారు. ఒకే సెంటర్ లో ఇంతమంది విద్యార్థులకు పెద్దమొత్తంలో మార్కులు రావడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. ఫలితాలను పది రోజులు ముందుకు జరిపి సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించటం కూడా అనేక సందేహాలకు తావిచ్చిందన్న ఆయన... ఈ వ్యవహారం బయటకు రాగానే పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించాల్సిన కేంద్రం ఎందుకు ఈ అంశాన్ని ఇప్పటిదాకా పట్టించుకోలేదని నిలదీశారు.


కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అంతా సవ్యంగానే జరిగిందంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం విడ్డూరంగా ఉందని కేటీఆర్ మండిపడ్డారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే వరకు కూడా కేంద్రం ఈ అంశాన్ని పట్టించుకోకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని... గ్రేస్ మార్కుల విధానమే లేని చోట ఏకంగా 1563 మందికి గ్రేస్ మార్కులు ఎందుకిచ్చారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. సాధ్యం కాని విధంగా కొంతమంది విద్యార్థులకు 718, 719 మార్కులు రావటం కూడా మొత్తం గ్రేస్ మార్కుల విధానంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ను ప్రమాదంలోకి నెట్టి ఇప్పుడు వాస్తవాలు బయటకు రాకుండా నానాతంటాలు పడుతున్నారని మండిపడ్డారు. గ్రేస్ మార్కుల అంశమే కాకుండా నీట్ పేపరే లీకైందంటూ వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. గుజరాత్, బీహార్ లో పోలీసులు నీట్ లో అవకతవకలు పాల్పడిన కొంతమందిని అరెస్ట్ చేశారని, వరుస వ్యవహారాలతో నీట్ ఎగ్జామ్ తీరుపై అనుమానాలు బలపడుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.

Tags

Next Story