KTR: 40 వేల కోట్ల తెలంగాణ ఆస్తులను మోదీ ప్రభుత్వం అమ్ముతోంది- కేటీఆర్

KTR: తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థలను అమ్మేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మొద్దంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు ఆయన లేఖ రాశారు.. తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూముల విలువ సుమారు 40వేల కోట్ల వరకు ఉంటుందని లేఖలో పేర్కొన్నారు..
హిందూస్థాన్ కేబుల్స్ లిమిటెడ్, హిందూస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మా లిమిటెడ్, హెచ్ఎంటీ, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల భూములను మోదీ ప్రభుత్వం తన డిజ్ ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికల్లో భాగంగా అమ్ముతోందని కేటీఆర్ అన్నారు.. ఈ ఆరు సంస్థలకు గతంలో సుమారు 7 వేల 200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.. ప్రభుత్వ ధరల ప్రకారం కనీసం 5వేల కోట్లకుపైగా ఈ భూమి విలువ ఉంటుందని.. మార్కెట్ ధరల ప్రకారం 40వేల కోట్లు ఉంటుందని కేటీఆర్ అన్నారు.
తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ఎన్నో రాజ్యాంగబద్ద హామీల అమలును పట్టించుకోని మోదీ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పెట్టబడులు ఉపసంహరించే పేరుతో వాటి ఆస్తులను అమ్మేందుకు ప్రయత్నిస్తోందంటూ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. హైదరాబాద్లో ప్రజా రవాణా కోసం చేపట్టే స్కైవే వంటి ప్రజోపయోగ ప్రాజెక్టులకు భూములు అడిగితే మార్కెట్ ధరల ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, రాష్ర్టం ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్మే హక్కు కేంద్రానికి ఎక్కడుందంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను ప్రశ్నించారు..
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా కొనసాగిన ఆయా సంస్థలను అమ్మడానికి బదులు పునరుద్దరణ చేపట్టి వాటిని బలోపేతం చేయాలని కేటీఆర్ కేంద్రానికి సూచించారు. ఇలా చేయకుండా తెలంగాణలోని అయా కంపెనీల ఆస్థులను అమ్మి సొమ్ము చేసుకుని బయటపడతామంటే కచ్చితంగా వ్యతిరేకిస్తామని హెచ్చరించారు. తిరిగి ప్రారంభించేందుకు అవకాశం లేకుంటే ఆయా సంస్థలున్న ప్రాంతంలోనే నూతన పరిశ్రమల ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com