Lal Darwaza Bonalu: వైభవంగా లాల్ దర్వాజ బోనాలు.. భారీ బందోబస్తు, ట్రాఫిక్ ఆంక్షలతో..

Lal Darwaza Bonalu: హైదరాబాద్ పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర కన్నుల పండవగా కొనసాగుతోంది. ఆలయానికి భారీగా తరలివస్తున్న భక్తులు.. అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ఇక ఆనవాయితీ ప్రకారం సింహవాహిని అమ్మవారికి దేవేందర్ గౌడ్ కుమారుడు, కోడలు తొలిబోనం సమర్పించారు. అమ్మవారికి భారత స్టార్ బాడ్మింటన్ పీవీ సింధు బంగారు బోనం సమర్పించారు. ఇక బీజేపీ నేత పురందేశ్వరి అమ్మవారిని దర్వించుకున్నారు.
ఇక మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్రెడ్డి, మహమూద్ అలీ పట్టువస్త్రాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్.. బోనాల జాతర బాగా జరుపుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. బోనాల జాతర నగరం అందరం కలిసి మెలిసి జరుపుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
అందరి సహకారంతో బోనాలు గొప్పగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. లాల్ దర్వాజ బోనాల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అంబర్పేట, రామాంతపూర్, లోయర్ ట్యాంక్బండ్, ఇక్బాల్ మినార్ నుంచి కట్టమైసమ్మ టెంపుల్ వరకు రేపటిదాకా ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు.
రేపు సాయంత్రం 4 గంటలకు లాల్ దర్వాజా సింహా వాహిని మహంకాళీ అమ్మవారి ఆలయం వద్ద రంగం కార్యక్రమం జరగనుంది. ఆ తర్వాత ఓల్డ్ సిటీ లోని ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో శాలిబండ నుంచి చార్మినార్ మీదుగా పురాణపూల్ వరకు భవానీ రథయాత్ర కన్నుల పండుగగా జరగనుంది. పోతరాజుల విన్యాసాలు, తీన్మార్ డాన్సులతో ఓల్డ్ సిటీ మారు మోగనుoది. దీంతో బోనాల ఉత్సవాలు ముగియనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com