మెదక్ జిల్లాలో ఆటోలు, బైక్లను వెంబడిస్తోన్న చిరుతలు

మెదక్ జిల్లాలో చిరుత పులి పిల్లలు ఏకంగా గ్రామ శివారులో వచ్చేస్తున్నాయి. దీంతో భయాందోళనకు గురవుతున్నారు గ్రామస్థులు. చిన్నశంకరంపేట మండలం, కామారం గ్రామ శివారులో.. గత కొన్ని నెలలుగా చిరుత పులులు సంచరిస్తున్నాయి. అటవీ అధికారులకు సమాచారం ఇచ్చినా ఫలితం లేకపోతోంది. ఏకంగా రోడ్డుపైకి వచ్చిన చిరుతుపిల్లలు.. ఆటోలు, బైక్లను వెంబడిస్తున్నాయి. గ్రామంలోకి వస్తోన్న చిరుత పులులను.. టపాకాయలు పేల్చి తరిమేస్తున్నట్లు తెలిపారు. పొలాలకు వెళ్లాలంటే భయమేస్తోందంటున్నారు స్థానికులు. చిరుతల నుంచి తమను కాపాడాలంటూ.. వేడుకుంటున్నారు గ్రామస్థులు.
కామారం గ్రామ సమీపంలో మామిడి తోటల దగ్గర అటుగా వెళ్తున్న ఓ ఆటోను వెంబడించాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలతో అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. పొలాలకు వెళ్లాలంటేనే రైతులు గజగజలాడుతున్నారు. టపాసులు పేలుస్తూ గుంపులుగా పొలాలకు వెళ్లి.. పనులు చేసుకుంటున్నారు. చిరుత పులుల భయంతో రాత్రి వేళలు నిద్రలేకుండా జాగారం చేస్తున్నామని.. వెంటనే వాటిని బంధించాలని స్థానికులు వేడుకుంటున్నారు.
ఇదిలా ఉంటే అటవీశాఖ అధికారులు కూడా అక్కడి ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఎవరూ ఒంటరిగా ప్రయాణించవద్దని.. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com