Kavitha: కవిత అరెస్ట్‌లో నిబంధనల ఉల్లంఘన లేదన్న రౌజ్‌ అవెన్యూ కోర్టు

Kavitha: కవిత అరెస్ట్‌లో నిబంధనల ఉల్లంఘన లేదన్న  రౌజ్‌ అవెన్యూ కోర్టు
కవిత అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రెస్‌నోట్‌ విడుదల

డిల్లీ మద్యం కేసులో తనను అరెస్ట్‌ చేసే విషయంలో పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్‌-19 కింద ఉన్న నిబంధనలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పాటించలేదన్న MLC కవిత వాదనలను రౌజ్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి MK నాగ్‌పాల్‌ కొట్టేశారు. ఆమె అరెస్ట్‌ విషయంలో ED నిబంధనల ప్రకారమే నడుచుకొందని స్పష్టంచేశారు.

ఈ నెల 15న హైదరాబాద్‌లో ఆమెను ED అరెస్ట్‌ చేసింది. 16న కోర్టులో హాజరు పరిచి.. కస్టడీ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై న్యాయమూర్తి వెలువరించిన తీర్పు కాపీ తాజాగా బయటికొచ్చింది. దిల్లీలోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వోద్యోగులకు 100 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చిన సౌత్‌ గ్రూప్‌లో నిందితురాలు భాగస్వామిగా ఉన్నట్లు, దిల్లీ ఎక్సైజ్‌ విధానాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి తొలి నుంచీ నేరపూరిత కుట్రలో పాలుపంచుకున్నట్లు ఆరోపణలున్నాయని ప్రత్యేక న్యాయమూర్తి నాగ్‌పాల్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో సహ నిందితులుగా ఉండి.. తర్వాత అప్రూవర్‌లుగా మారిన P. శరత్‌చంద్రారెడ్డి, మాగుంట రాఘవ్‌, దినేశ్‌ అరోడా, ఇతర సహ నిందితులు సమీర్‌ మహేంద్రు, గోరంట్ల బుచ్చిబాబు, సాక్షి మాగుంట శ్రీనివాసులురెడ్డి, వి.శ్రీనివాసరావు, గోపీ కుమరన్‌లు ఇచ్చిన వాంగ్మూలాలు నిందితురాలి పాత్రకు అద్దంపడుతున్నాయని అన్నారు. కవితతో సమావేశమైన తర్వాతే.. మాగుంట శ్రీనివాసులురెడ్డి, అతని కుమారుడు మాగుంట రాఘవ్‌లు ఆమె అనుచరుడైన గోరంట్ల బుచ్చిబాబుకు రెండు విడతల్లో 25 కోట్లు ఇచ్చినట్లు రికార్డుల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. ఈ మొత్తంలో సగం తాను చెల్లిస్తానని నిందితురాలు హామీ ఇచ్చారనీ... ఈ కోణంలో ఇంకా దర్యాప్తు జరగాల్సి ఉందని న్యాయమూర్తి తెలిపారు. ఇచ్చిన ముడుపులను తిరిగి రాబట్టుకోవడానికి టోకు వ్యాపార సంస్థ ఇండోస్పిరిట్‌లో భాగస్వామిగా చేర్చిన అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లై... నిందితురాలి ప్రతినిధి లేదా బినామీనే అని ఉత్తర్వులో పేర్కొన్నారు. కొన్ని మొబైల్‌ ఫోన్లను ఫార్మాట్‌, ట్యాంపరింగ్‌ చేసినట్లు ఆమెపై ఆరోపణలున్నాయన్న న్యాయమూర్తి... మనీ లాండరింగ్‌ నేరంలో భాగస్వామి కావడంతోపాటు, కీలకపాత్ర పోషించినట్లు రికార్డులు చెబుతున్నాయని తెలిపారు. దర్యాప్తు అధికారి సమర్పించిన కేస్‌ ఫైల్‌ను పరిశీలిస్తే విచారణకు ఆమె హాజరు కాకపోవడం వల్ల దర్యాప్తు స్తంభించినట్లు కనిపిస్తోందన్న న్యయమూర్తి నాగ్‌పాల్‌... నేరపూరిత ఆదాయంలోని ప్రధాన భాగాన్ని వెలికితీయడానికి ఆమెను విచారించాల్సిన అవసరం కనిపిస్తోందన్నారు. PMLA లోని సెక్షన్‌-19 కింద పొందుపరిచిన అన్ని రకాల రక్షణలను అనుసరించే నిందితురాలిని ED అధికారులు అరెస్ట్‌ చేయడమే కాకుండా.. అందుకు కారణాలను ఆమెకు లిఖితపూర్వకంగా ఇచ్చారని స్పష్టంచేశారు. ఇందులో చట్టంలోని నిబంధనల ఉల్లంఘన కనిపించలేదని వివరించారు.


Tags

Read MoreRead Less
Next Story