CM Revanth Reddy: ధరణి సంగతేంటి ?

CM Revanth Reddy: ధరణి సంగతేంటి ?
X
ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు

రాష్ట్రంలో భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిరేవంత్‌రెడ్డి ఆదేశించారు. గతంలో వేసిన కోనేరు రంగారావు కమిటీ మాదిరిగానే ఈ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ధరణి నిర్వహణ, పారదర్శకతపై అనేక ప్రశ్నలు సంధించిన CM... పోర్టల్‌ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు జరిగిన నిర్ణయాలపై సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించారు.

ధరణి- భూ సమస్యలపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్‌ రాజనర్సింహ, సీఎస్‌ శాంతికుమారి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ పాల్గొన్నారు. భూవివాదాల పరిష్కారానికి గతంలో వేసిన కోనేరు రంగారావు కమిటీ మాదిరిగానే ఒక కమిటీని ఏర్పాటు చేయాలని CM ఆదేశించారు. మంత్రులు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, రైతు ప్రతినిధులు, భూ చట్టాల నిపుణులను సభ్యులుగా నియమించాలని సూచించారు. పోర్టల్‌కు సంబంధించిన వివరాలపై నవీన్‌ మిత్తల్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. సమీక్ష సందర్భంగా సీఎంతోపాటు మంత్రులు పలు ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. ధరణి లావాదేవీలపై వస్తున్న విమర్శలకు డేటా రూపంలో సమాచారం అందించాలని ఆదేశించినట్లు సమాచారం.


రిజిస్ట్రేషన్లు- మ్యుటేషన్ల సేవలకు భూ యజమానులు చెల్లిస్తున్న సొమ్ము ఎవరి ఖాతాలోకి వెళ్తోందని సీఎం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సేవలకు రైతులు చెల్లించే మొత్తం ప్రభుత్వ ఖజానాకే చేరుతోందా? లేక పోర్టల్‌ నిర్వహణదారుల చేతుల్లోకి వెళ్తోందా? అని అడిగారు. చెల్లింపులు రద్దు చేసుకుంటే ఆ సొమ్ములు దరఖాస్తుదారులకు వెనక్కి ఇవ్వడం లేదని తెలిసిందని... అవి ఎవరి వద్ద ఉంటున్నాయని... నవీన్‌ మిత్తల్‌ను సీఎం అడిగారు. ఆ డబ్బుల చెల్లింపు జరుగుతోందని ఆయన వివరణ ఇవ్వగా.. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకుని.. డబ్బులు వెనక్కి రావడం లేదని చాలామంది చెబుతున్నారని.. ఒకసారి పరిశీలన చేయాలని సూచించారు. ధరణి నిర్వహణకు ఏటా ఎంత చెల్లిస్తున్నారని CM ప్రశ్నించగా 25 కోట్లు చెల్లిస్తున్నట్లు అధికారులు సమాధానమిచ్చారు. ధరణి విలువ అంత తక్కువా? అలాంటప్పుడు సంబంధిత కంపెనీ షేర్ల విలువ దాదాపు 1260 కోట్లకు ఎలా పోతోందని CM ప్రశ్నించినట్లు తెలిసింది.

పోర్టల్‌ ఏర్పాటు చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందనేది సమగ్ర నివేదిక రూపొందించి ఇవ్వాలని రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. 2014కు ముందు, ఆ తరువాత భూముల సమాచారం తయారు చేయాలని... వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు సంబంధించిన నివేదిక రూపొందించాలని స్పష్టం చేశారు. నిషేధిత భూములు, అసైన్డ్, పట్టా భూముల సమగ్ర సమాచారం సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో భూముల సర్వేకు, డిజిటైజేషన్‌కు కేంద్రం కేటాయించిన 83 కోట్లు ఎక్కడికి పోయాయని సీఎం ప్రశ్నించారు. నిజామాబాద్‌ జిల్లాలో నిర్వహించిన భూ భారతి తర్వాత రాష్ట్రవ్యాప్త సర్వే ఏమైందని CM ప్రశ్నించినట్లు తెలిసింది. త్వరలో మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Tags

Next Story