Podu Lands: మహబూబ్ నగర్ లో పోడు భూముల పంచాయతీ
మహబూబ్ నగర్ జిల్లాలో పోడు భూముల పంచాయతీ మొదలైంది. హక్కు పత్రాలు ఇంకా రైతుల చేతికి అందకముందే అటవీశాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో ప్లాంటేషన్ చేసేందుకు అటవీ అధికారులు ప్రయత్నించడంతో రైతులు అడ్డుకున్నారు. బొల్లెపల్లి శివారులో గిరిజన, గిరిజనేతర నిరుపేద రైతులు పోడు భూములను సాగుచేసుకుంటున్నారు.
హక్కు పత్రాల కోసం క్లేమ్లు సమర్పించిన 124 మందిలో 64 మందికి ప్రభుత్వం హక్కు పత్రాలు జారీ చేసింది. ఇటీవల హక్కు పత్రాల పంపిణీ ప్రక్రియ కూడా ప్రారంభించగా ఇందులో 19 మందికే హక్కు పత్రాలు చేతికి అందాయి. మిగిలిన రైతులు ఒకవైపు హక్కుపత్రాల కొరకు ఎదురుచూస్తుండగానే, అవే పోడు భూముల్లో ఉన్నఫలంగా మొక్కలు నాటేందుకు అటవీ అధికారులు రావడంతో రైతులు అడ్డుకున్నారు. హక్కు పత్రాలు పూర్తిస్థాయిలో పంపిణి జరుగక ముందే తాము సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో మొక్కలు నాటనివ్వం అంటూ హెచ్చరించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com