Crime News: బీమా డబ్బు కోసం కన్నతండ్రినే...
Crime News: అవసరానికి డబ్బు ఇవ్వమంటే తండ్రి లేవన్నాడు.. దాంతో కన్నతండ్రిని హతమార్చాడు. అతడి పేరు మీద చేయించిన ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని ఈ పథకం వేశాడు. కానీ పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో ఈ దారుణం చోటు చేసుకుంది. బొంరాస్పేట మండలంలోని బిక్యానాయక్తండాకు చెందిన రాథోడ్ ధన్సింగ్ (68)కు ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు తాండూరులో నివసిస్తున్నాడు. ఇద్దరు కుమారులు తండ్రితో ఉంటున్నారు. చిన్న కుమారుడు శ్రీనివాస్ నాయక్ తండ్రి పేరుతో ఓ ప్రైవేట్ బీమా సంస్థలో రూ.50 లక్షల ప్రమాద బీమా చేయించి నామినీగా తన పేరు నమోదు చేయించాడు. తనకు డబ్బు అవసరం ఉందని రెండు మూడు రోజుల నుంచి తండ్రిని అడుగుతున్నాడు శ్రీనివాస్... లేవని చెప్పడంతో అన్నదగ్గరకు వెళ్లి అడుగుదామని అన్నాడు.. దాంతో సరేనంటూ తండ్రి శ్రీనివాస్ బండి మీద బయల్దేరాడు.. కానీ శివారులో వాహనం అదుపు తప్పి తండ్రి మరణించాడని, తండాకు వచ్చి చెప్పాడు.. అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల ఎంక్వైరీలో బీమా డబ్బు కోసమే తండ్రిని హతమార్చినట్లు ఒప్పుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com