Telangana: తెలంగాణలో భూముల మార్కెట్ విలువ ఆకాశంలోకి..

Telangana: తెలంగాణలో భూముల మార్కెట్ విలువల భారీగా పెరుగనున్నాయి. కనిష్టంగా 25 శాతం, గరిష్టంగా 50 శాతం పెంచబోతోంది తెలంగాణ ప్రభుత్వం. వ్యవసాయ భూములు విలువ 50 శాతం, ఖాళీ స్థలాలు 35 శాతం, అపార్ట్మెంట్ల ఫ్లాట్లు 25-30 శాతం పెంచాలని నిర్ణయించింది స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ. ఇప్పుడున్న మార్కెట్ విలువకు, కొత్త విలువలకు దాదాపు 40 శాతం తేడా ఉంది. దీనిపై గురువారం సుధీర్ఘ కసరత్తు చేశారు అధికారులు. ఈ ప్రతిపాదనలను జిల్లా రిజిస్ట్రార్లకు అందజేశారు.
జిల్లా కలెక్టర్లతో రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ సైతం చర్చలు జరిపారు. ఈ ప్రతిపాదనలను ఇవాళ, రేపు ఆమోదించి పంపించనున్నారు. కొత్త మార్కెట్ విలువలు ఫిబ్రవరి ఒకటినుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పుడున్న మార్కెట్ విలువకు, కొత్త విలువలకు తేడా దాదాపు 40 శాతం ఉంది. ప్రభుత్వ మార్కెట్ విలువలకు రెండు మూడు రెట్ల అధికంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్న వాటిని అత్యధిక ప్రాధాన్య ప్రాంతాలుగా గుర్తించారు.
షాపింగ్ కాంప్లెక్స్లో అన్ని ఫ్లోర్లకు ఒకే మార్కెట్ విలువను నిర్ణయించారు. స్థలాల విలువల సగటు 35 శాతం పెరిగింది. తక్కువ విలువ ఉన్న ప్రాంతాల్లో 50 శాతం కూడా హెచ్చింది. అపార్ట్మెంట్లలో చదరపు అడుగుకు 25-30 శాతం దాకా పెంచారు. ఫిబ్రవరి ఒకటినుంచి కొత్త ఆస్తుల మార్కెట్ విలువలు పెరగుతుండటంతో.. నిన్నటినుంచి భారీగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల సబ్రిజిస్ట్రార్ కిటకిటలాడుతున్నాయి.
మరోవైపు.. భూముల మార్కెట్ విలువలను పెంచి 7 నెలలు కాకముందే మరోసారి సవరించాలనే నిర్ణయాన్ని వాయిదా వేయాలంటున్నాయి రియల్ ఎస్టేట్ సంఘాలు. ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఇటీవల పెరిగిన భూముల ధరలు, నాలా పన్నులు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు కనీసం ఆరునెలలైనా సమయం ఇవ్వాలంటున్నాయి. రిజిస్ట్రేషన్, నాలా ఛార్జీలు తగ్గించాలని విన్నవించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com