MEDARAM: వనమంతా జనం... ముగిసిన మహా సంబరం

ఆదివాసీ సంప్రదాయం, భక్తి, ఆధ్యాత్మికత కలసి రూపుదిద్దుకున్న ప్రపంచ ప్రసిద్ధ మేడారం మహాజాతర మరోసారి అద్భుత ఘట్టానికి తెరదించింది. కోట్లాది మంది భక్తుల నడుమ జరిగిన ఈ మహోత్సవం, చివరి రోజు భావోద్వేగాల మధ్య ముగిసింది. వనం నుంచి జనంలోకి వచ్చిన వనదేవతలు తిరిగి అడవిలోకి ప్రవేశించడంతో మేడారం మహాజాతరకు శనివారం అధికారిక ముగింపు పలికింది. అమ్మవార్లకు వీడ్కోలు పలుకుతూ భక్తులు “మళ్లీ 2028లో కలుద్దాం” అంటూ కన్నీటి వీడ్కోలు ఇచ్చారు.
ఈ నెల 28న ప్రారంభమైన మేడారం మహాజాతర, చివరి రోజున భక్తులతో కిక్కిరిసిపోయింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ సహా పలు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు మేడారానికి తరలివచ్చారు. చివరి రోజు గద్దెలపై తల్లులు కొలువుదీరడంతో, దర్శనానికి భక్తులు భారీగా క్యూ కట్టారు. అడవిలోని ప్రశాంతత నుంచి జనసంద్రంగా మారిన మేడారం ప్రాంతం భక్తి పారవశ్యంతో మార్మోగింది. మేడారం జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం అయిన వనప్రవేశం శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. గురువారం గద్దెలపై కొలువుదీరిన అమ్మవార్లు, భక్తుల పూజల అనంతరం చిలకలగుట్ట వైపు వనప్రవేశం చేశారు. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ముగింపు కార్యక్రమాలు పూర్తి కావడంతో, వనం వీడి జనాల మధ్యకొచ్చిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు తిరిగి వనంలోకి చేరుకున్నారు.
ఈ దృశ్యం చూసిన భక్తులు బావోద్వేగానికి లోనయ్యారు. జాతర ప్రారంభం నుంచీ ప్రతి రోజు ప్రత్యేక ఘట్టాలతో సాగింది. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజు గద్దెలపైకి చేరుకున్నారు. ఆ తరువాత 29వ తేదీన చిలకలగుట్ట నుంచి సమ్మక్కతల్లిని ప్రధాన గద్దెపై ప్రతిష్టించారు. ఈ ఘట్టం మేడారం జాతరలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.
శుక్రవారం సమ్మక్క, సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులు భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఇద్దరు తల్లులు గద్దెలపై కొలువుదీరడంతో, భక్తులు క్రమంగా దర్శనం చేసుకుని గూడారాలను ఖాళీ చేసి తమ తమ ఊళ్లకు తిరుగు ప్రయాణం ప్రారంభించారు. శనివారం నలుగురు తిరిగి వనప్రవేశం చేయడంతో జాతరకు అధికారిక ముగింపు పలికినట్టయింది. ఈసారి కూడా భక్తుల నమ్మకం, విశ్వాసం, భక్తి మేడారం అడవులను పరవశింపజేశాయి. వనప్రవేశంతో జాతర ముగిసినా, భక్తుల హృదయాల్లో అమ్మవార్ల అనుభూతి చెగని ముద్రగా మిగిలింది. ఇక మరో నాలుగేళ్ల తర్వాత, 2028లో మళ్లీ అదే భక్తి, అదే ఉత్సాహంతో మేడారం జనసంద్రంగా మారనుంది. నాలుగేళ్లకోసారి జరిగే ఈ జాతర కోసం భక్తులు ఎదురుచూస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
