MEDARAM: చివరి అంకానికి మేడారం మహా జాతర

MEDARAM: చివరి అంకానికి మేడారం మహా జాతర
నేడు వన ప్రవేశం చేయనున్న వన దేవతలు... పోటెత్తుతున్న భక్తులు

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ముగింపు దశకు వచ్చేసింది. వనం నుంచి వచ్చిన దేవతలు ఇవాళ రాత్రి తిరిగి వన ప్రవేశం చేయనున్నారు. ఈ ఘట్టంతో మహా జాతర పరిసమాప్తమవుతుంది. ఇక మేడారం పరిసరాలు జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. భక్తులు నిర్విరామంగా వనదేవతల్ని దర్శించుకుంటున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి, పస్రా వద్ద కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడింది. నాలుగు రోజులుగా అంగరంగవైభవంగా జరుగుతున్న మేడారం మహాజాతర చివరి అంకానికి చేరుకుంది. అమ్మల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఇవాళ సాయంత్రం పూజారులు గద్దెలవద్దకు వచ్చి సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. అనంతరం.. వనదేవతల వన ప్రవేశం మొదలవుతుంది. సమ్మక్కను చిలకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లి ఆలయానికి, పగిడిద్దరాజును మహబూబూబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరు నాగారం మండలం కొండాయ్ గ్రామానికి పూజారులు ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ ప్రక్రియతో జాతర ముగుస్తుంది.


మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు. వనదేవతలను దర్శించుకునేందుకు భక్తజనం క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. గద్దెల పరిసరాలన్నీ కిక్కిరిసి పోతున్నాయి. మూడు రోజుల్లో మేడారానికి రాలేని భక్తులు... చివరి రోజైన ఇవాళ వచ్చి దర్శనాలు చేసుకుంటారు. తల్లల వనప్రవేశం సమయంలో కొంతసేపు దర్శనాలను నిలిపివేసినా... మళ్లీ యథాతథంగా దర్శనాలు జరుగుతాయి. రెండేళ్లకు ఒకసారి అమ్మవార్లను దర్శించుకోవడంపై భక్తులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.మహాజాతరకు భక్తులు పోటెత్తడంతో.. మేడారం దారిలో భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. తాడ్వాయి, పస్రా గుండ్లవాగు వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. కిలో మీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. ఎంతకీ వాహనాలు ముందుకు కదలక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు.

మేడారం జాతరలో కోళ్ల ధరలు కొండెక్కాయి. తొలి రెండు రోజులు కోడి కేజీ 150 రూపాయలకు విక్రయించారు. చాలా దుకాణాలలో కోళ్లు అయిపోవడం, సరఫరా లేకపోవడంతో ధర పెంచేశారు. కోడి కేజీకి 500 రూపాయలకు విక్రయించారు. భారీగా ధర ఉండటంతో చాలా మంది చికెన్‌ సెంటర్ల నుంచి వెనుదిరిగారు. కొంత మంది మేకలు, గొర్రెల మాంసం కొనుగోలు చేశారు. జాతరకు వచ్చిన ఇద్దరు భక్తులు గుండెపోటుతో మృతి చెందడం ఆయా కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. మృతులను పెద్దపల్లి జిల్లాకు చెందిన లక్ష్మి, విజయవాడకు చెందిన సాంబయ్యగా గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story