Minister KTR : తెలంగాణలో పెట్టుబడి పెట్టండి.. ఫ్రాన్స్ కంపెనీల సీఈవోలతో మంత్రి కేటీఆర్..!
Minister KTR : తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు కాస్మొటిక్ వ్యాలీ సంస్థలు ఆసక్తి చూపాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఫ్రాన్స్లో పర్యటిస్తున్న ఆయన... ఆ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. భారత్లో సౌందర్య సాధనాలకు భారీగా డిమాండ్ ఉందని.. మార్కెటింగ్లో ఏటా భారీ వృద్ధి రేటు సాధిస్తోందని కేటీఆర్ చెప్పారు. కరోనా సమయంలోనూ సౌందర్య సాధనాల విక్రయాలు తగ్గలేదన్నారు.
ప్రసిద్ధి చెందిన కాస్మొటిక్ వ్యాలీ డిప్యూటీ సీఈవో, బెచెరో నేతృత్వంలో పలు సంస్థల అధిపతులు మంత్రి కేటీఆర్ను కలిసి ఈ విషయమై చర్చించారు. రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటు ద్వారా దేశమంతటా మార్కెటింగ్కు అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అన్ని విధాలా సహకరిస్తామన్నారు. త్వరలో తెలంగాణను సందర్శించాలని మంత్రి కోరగా పారిశ్రామికవేత్తలు సుముఖత వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఫ్రాంకీని కేటీఆర్ పోచంపల్లి శాలువతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు.
వైమానిక, రక్షణ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ అత్యంత విశ్వసనీయ గమ్యస్థానంగా ఉందని, క్షిపణుల తయారీ పరిశ్రమలకు సిద్ధంగా ఉందని కేటీఆర్ చెప్పారు. పారిస్లోని ప్రసిద్ధ క్షిపణుల తయారీ సంస్థ ఎంబీడీఏ డైరెక్టర్లు బోరిస్ సాలోమియాక్, పోల్నీల్ లివిక్, సీనియర్ ఉపాధ్యక్షుడు జీన్ మార్క్ పేరాడ్తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ప్రపంచంలోని ప్రసిద్ధ వైమానిక సంస్థలు తెలంగాణలో పరిశ్రమలను స్థాపించి.. విమానాలు, హెలికాప్టర్ల విడిభాగాలను తయారు చేస్తున్నాయని ఆయన వివరించారు.
క్షిపణుల తయారీకి సన్నద్ధమవుతున్నామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలని ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. త్వరలోనే హైదరాబాద్ను సందర్శించాలన్నారు. అనంతరం ప్రసిద్ధ వైమానిక సంస్థ ఏరోక్యాంపస్ అక్విటైన్ డైరెక్టర్ జేవియర్ ఆడియన్తోనూ కేటీఆర్ సమావేశమయ్యారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com