Minister KTR : ఈటల, రేవంత్ గోల్కొండ రిసార్ట్స్లో భేటీ.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!

Minister KTR : ఈటల, రేవంత్ గోల్కొండ రిసార్ట్స్లో భేటీ అయ్యారంటూ సంచలనానికి తెరతీశారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ఇదంతా అబద్ధం అని రేవంత్, ఈటలలో ఏ ఒక్కరు స్టేట్మెంట్ ఇచ్చినా.. వారిద్దరు కలిసి ఉన్న ఫొటోలను బయటపెడతానంటూ సవాల్ విసిరారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలవడం కోసం కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నాయని ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేయాలని గోల్కొండ రిసార్ట్లో ఇద్దరు నేతల మధ్య ఒప్పందం కుదిరింది వాస్తవం అని గట్టిగా చెబుతున్నారు కేటీఆర్.
ఈటల రాజేందర్ త్వరలో కాంగ్రెస్లో చేరడం ఖాయం అంటూ పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు కేటీఆర్. హుజూరాబాద్లో కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకొని ఉమ్మడి అభ్యర్థిగా ఈటల రాజేందర్ను నిలబెట్టాయని కేటీఆర్ విమర్శించారు. హుజురాబాద్లో టీఆర్ఎస్ను నిలువరించాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. కరీంనగర్, నిజామాబాద్, నాగార్జునసాగర్లోనూ ఇదే జరిగిందని చెప్పారు. హుజురాబాద్ ఎన్నికలో టీఆర్ఎస్ను నిలువరించలేమని తెలిసే రెండు పార్టీలు ఓట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాయన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com