తెలంగాణలో భారీగా పెరిగిన మిస్సింగ్ కేసులు

తెలంగాణ వ్యాప్తంగా రోజురోజుకు మిస్సింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో మిస్సింగ్ కేసులు భారీగా పెరిగినట్లు పోలీసులు తెలిపారు. నాలుగు రోజుల్లో ఏకంగా 203 మిస్సింగ్ కేసులు నమోదైనట్లు ప్రకటించారు. ఈ వివరాలన్నీ పోలీసుల అధికారిక వైబ్సైట్లో వెల్లడించారు. బుధవారం ఒక్కరోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా 65 మంది వ్యక్తులు అదృశ్యం అయినట్లు పోలీసులు పేర్కొన్నారు. బుధవారం నాడు ఒక్క హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 13 మంది, సైబరాబాద్ పరిధిలో 11 మంది, రాచకొండ పరిధిలో 8 మంది తప్పిపోయినట్లు కేసులు నమోదయ్యాయి.
ఈ నెల 26న 65 మిస్సింగ్ కేసులు, 27న 62, 28 న 65 కేసులు, 29న 11 మిస్సింగ్ కేసులు నమోదైనట్లు వెబ్సైట్లో వెల్లడించారు. వివిధ కారణాలతో ఇళ్ల నుంచి వెళ్లిపోతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టిసారించినట్లు పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే నేరాల నియంత్రణలో నిత్యం బిజీ గా వున్న పోలీసులకు మిస్సింగ్ కేసులు సవాల్ విసురుతున్నాయి. పోలీసులను తలలు పట్టుకునేలా చేస్తున్నాయి. ఆ కేసులు మిస్టరీగానే మిగిలి పోతున్నాయి. ఏటా నమోదయ్యే మిస్సింగ్ కేసుల్లో దాదాపు 85 శాతం కేసులు ట్రేస్ అవుతున్నా.. 15 శాతం కేసులు తేలకుండానే పోతున్నాయి. గతేడాది రాష్ట్రంలో నమోదైన మిస్సింగ్ కేసుల్లో ఇంకా 3 వేల 418 కేసులు ట్రేస్ అవుట్ కాలేదు. ఇందులో 655 మంది మైనర్ల ఆచూకీ లభించలేదు. ఇలా పెండింగ్లో ఉన్న కేసులను సీఐడీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు పోలీసులు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com