kavitha: కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే కాళేశ్వరం కమిషన్

kavitha: కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే కాళేశ్వరం కమిషన్
X
ప్రభుత్వం విధానం కుట్రపూరితం... మహాధర్నాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత... ధర్నాకు భారీగా తరలివచ్చిన జాగృతి శ్రేణులు

కేసీఆర్‌ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని... ఆయనకు నోటీసులు ఇచ్చారంటే మొత్తం తెలంగాణకు కూడా ఇచ్చినట్లే అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడమే కేసీఆర్‌ చేసిన తప్పా అని నిలదీశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో కవిత పాల్గొన్నారు. ఈ నిరసన దీక్షకు తెలంగాణ జాగృతి నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు, కాంట్రాక్టర్ల కోసమే పని చేస్తోందని కవిత తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిన కమిషన్, ఈ ప్రాజెక్టులో 90 శాతం పంప్‌హౌస్‌లు నిర్మించిన మెఘా కృష్ణారెడ్డికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు. ఇది ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని కవిత ఆరోపించారు. కేసీఆర్ ఏం తప్పు చేశారని ఆయనకు నోటీసులు ఇచ్చారని నిలదీశారు. 'నీళ్లు తీసుకురావడం ఆయన చేసిన తప్పా? తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడం తప్పా?' అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మూడు బ్యారేజీలేనా అని కూడా ఆమె నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుంటోందని కవిత ఫైరయ్యారు.

అది కాంగ్రెస్ కమిషన్

‘‘ అది కాళేశ్వరం కమిషన్‌ కాదు.. అది కాంగ్రెస్‌ కమిషన్‌, రాజకీయ కమిషన్‌." అని కవిత అన్నారు. " కాళేశ్వరం పూర్తయితే 35 శాతం తెలంగాణ భూభాగానికి నీళ్లు అందిస్తుంది. కేసీఆర్‌ది గట్టి గుండె కాబట్టి అంత పెద్ద ప్రాజెక్టు నిర్మించారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే కాళేశ్వరం కమిషన్‌ వేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మేడిగడ్డకు చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయట్లేదు. తెలంగాణ నీళ్లను ఏపీ తరలించుకుపోతుంటే సీఎం రేవంత్‌స్పందించట్లేదు. గోదావరి-పెన్నా అనుసంధానం పేరిట నీళ్ల తరలింపును అడ్డుకోవాలి. తెలంగాణ బిడ్డ ఈటల రాజేందర్‌ మాట్లాడకపోవడం శోచనీయం. బనకచర్లను ఆపే బాధ్యతను ఆయన తీసుకోవాలి. కాళేశ్వరానికి జాతీయ హోదా తీసుకొచ్చే బాధ్యతను ఈటల తీసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే 21 పంపు హౌస్ లు. 15 రిజర్వాయర్ లు ఉన్నాయి. కాళేశ్వరం స్టీల్ తో 100 ఈఫీల్ టవర్లు కట్టొచ్చు. సిమెంట్ తో 50 బుర్జు ఖలీఫాలు కట్టొచ్చు.’’ అని కవిత అన్నారు.


Tags

Next Story