తెలంగాణ సీఎం కేసీర్ కు ప్రధాని మోదీ షాక్!
తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రధాని మోదీ షాక్ ఇచ్చారు. హైదరాబాద్ పర్యటన సందర్భంగా హకీంపేట ఎయిర్ పోర్టులో మోదీకి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్కు ఆహ్వానం అందలేదు. గత నిబంధనలకు విరుద్ధంగా కేవలం ఐదుగురు అధికారులు మాత్రమే ఆహ్వానానికి రావాలని ఆదేశించారు. ఈ మేరకు పీఎం వ్యక్తిగత సహాయకుడు వివేక్ రాష్ట్ర సీఎస్ సోమేష్ కుమార్ కు ఫోన్ చేసి చెప్పారు. సాధారణంగా ప్రోటోకాల్ ప్రకారం ఏ రాష్ట్ర పర్యటనకైనా ప్రధాని వచ్చినప్పుడు ఆ రాష్ట్ర సీఎం ఆహ్వానం పలకడం ఆనవాయితీగా వస్తుంది.
ప్రధాని మోదీ.. హైదరాబాద్ పర్యటన సందర్భంగా.. గతంలో అనుసరించిన సంప్రదాయాలకు తిలోదాకలు ఇచ్చింది పీఎంవో. ప్రధాని రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు విమానాశ్రయం వద్దే రాష్ట్ర ప్రజల తరుపున గవర్నర్, సీఎం, కేంద్రమంత్రులు స్వాగతం పలుకుతారు. ఈసారి కూడా అలాగే చేయాలని సీఎం కేసీఆర్ భావించారు. హకీంపేటకు చేరుకుని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ స్వాగతం పలుకుతారని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా.. ప్రధానమంత్రి కార్యాలయానికి సమాచారమిచ్చింది.
దీనిపై స్పందించిన పీఎంవో.. ప్రధానమంత్రికి స్వాగతం పలకడానికి సీఎం కేసీఆర్ రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాని వ్యక్తిగత సహాయకుడు వివేక్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కు ఫోన్ చేసి చెప్పారు. మోదీకి స్వాగతం చెప్పడానికి కేవలం ఐదుగురు మాత్రమే రావాలని స్పష్టం చేశారు. హకీంపేట ఎయిర్ ఆఫీస్ కమాండెంట్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహిందర్రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ శ్వేతా మెహంతీ, సైబరాబాద్ సీపీ సజ్జనార్లు మాత్రమే.. హకీంపేట విమానాశ్రయానికి రావాలని ఆదేశించారు.
పీఎంవో తీసుకున్న ఈ నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం అవాక్కైంది. గతంలో ప్రధాని ఏ రాష్ట్రాల్లో అధికార పర్యటనకు వస్తే... ఆ రాష్ట్ర గవర్నర్, సీఎం, ఇతర ప్రముఖులు స్వాగతం పలుకుతారు. కానీ
ఈ సారి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ రావాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి కార్యాలయం చెప్పడం ఆసక్తిగా మారింది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని భావిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com