కీసర తహసీల్దార్ నాగరాజు కేసులో ఏసీబీ సోదాలు

తెలంగాణలో సంచలనం సృష్టించిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కోటి రూపాయల అవినీతి కేసులో ఏసీబీ దూసుడు పెంచింది. విచారణ ఎదుర్కొంటూ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడటంతో కేసు దర్యాప్తు మరింత వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే అల్వాల్ ఐసీఐసీఐ బ్యాంక్లో నాగరాజు లాకర్లను ఏసీబీ అధికారులు ఓపెన్ చేశారు. నాగరాజు బినామీ నందగోపాల్ పేరుతో ఉన్న ఈ లాకర్లో దాదాపు కిలోకుపైగా బంగారు ఆభరణాలను గుర్తించారు. ఈ రెండు లాకర్లను నందగోపాల్ పేరుతో ఉన్నాయి. ఈ రెండు అకౌంట్లు నాగరాజు భార్య స్వప్న ఉపయోగించుకుంటోంది.
బినామీ పేరుతో పెద్ద ఎత్తున్న ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించి ఏసీబీ.. ఇతర ఖాతాలపై విచారణ చేస్తున్నారు. రెండు రోజలు క్రితం నందగోపాల్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించగా.. లాకర్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు లాకర్లు ఓపెన్ చేయగా.. పెద్ద ఎత్తున బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే మరో బ్యాంక్ లాకర్లలో రెండు కిలోల బంగారాన్నీ సీజ్ చేశారు.
ఆగస్టు 14వ తేదీన నాగరాజు ఇంటిపైన దాడి చేసిన సమయంలో ఏసీబీ అధికారులకు ఓ బ్యాంకు లాకర్కు చెందిన తాళంచెవి లభించింది. అది నాగరాజు బంధువైన జి.జే.నరేందర్ పేరిట అల్వాల్లోని సౌత్ ఇండియన్ బ్యాంకు లాకర్గా ఏసీబీ గుర్తించింది. ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన సమయంలోనూ నాగరాజు లాకర్ విషయంలో సహకరించలేదని సమాచారం. ఎట్టకేలకు సదరు లాకర్ను తెరిచిన ఏసీబీ అధికారులకు అందులో 1532 గ్రాముల బంగారు ఆభరణాలు లభించాయి. వాటిని సీజ్ చేసిన ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో డిపాజిట్ చేయనున్నారు. ప్రస్తుతం కేసులో పట్టుబడ్డ నిందితులంతా చంచల్ గూడ జైల్లోనే ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

