MUNCIPALL POLLS: తెలంగాణలో పెను మార్పులకు "సెమీ ఫైనల్స్"

తెలంగాణ రాజకీయాల దిశను నిర్ణయించే కీలక ఘట్టంగా మున్సిపల్ ఎన్నికలు మారాయి. పట్టణ పాలనకే పరిమితమయ్యే సాధారణ ఎన్నికలుగా కాకుండా, రానున్న రాజకీయ సమీకరణాలకు సూచికగా ఈ ఫలితాలను అన్ని పార్టీలు చూస్తున్నాయి. ముఖ్యంగా 2028 అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు సంకేతాలుగా, అంతకంటే ముందున్న పంచాయతీ ఎన్నికలకు మానసిక రిహార్సల్గా ఈ పోరు రూపుదిద్దుకుంది. అందుకే రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో ఒక మలుపుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో జరుగుతున్న ఈ ఎన్నికలు ఇప్పుడు రెండు ప్రధాన రాజకీయ శక్తుల మధ్య మాత్రమే కాకుండా, మూడు దిశల పోరుగా మారాయి. అధికార కాంగ్రెస్ తన పట్టు నిలుపుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగితే, ప్రతిపక్ష బీఆర్ఎస్ తిరిగి పుంజుకోవాలని తహతహలాడుతోంది. ఇదిలా ఉండగా, బీజేపీ కూడా పట్టణ ఓటర్లలో తన స్థానం మరింత బలపరుచుకోవాలనే లక్ష్యంతో రంగంలోకి దిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పెద్ద పట్టణ ఎన్నికలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్కు ఇది కీలక పరీక్ష. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన విజయం యాదృచ్ఛికం కాదని నిరూపించాల్సిన బాధ్యత ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ పై ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు గణనీయంగా పెరిగినట్లు ఫలితాలు సూచించాయి. అదే ఊపును పట్టణాల్లోనూ కొనసాగించగలిగితే, కాంగ్రెస్కు ఇది బలమైన రాజకీయ ధృవీకరణగా మారుతుంది. అందుకే మంత్రులను పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్ఛార్జులుగా నియమించి, పట్టణ ఓటర్లను ఆకట్టుకునేలా విస్తృత వ్యూహాలు రచిస్తోంది.
కారు గేరు మార్చాల్సిందే
మరోవైపు, అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఆత్మవిశ్వాసం కోల్పోయిన బీఆర్ఎస్కు ఈ మున్సిపల్ ఎన్నికలు ప్రాణప్రదమైనవిగా మారాయి. గ్రామీణ ఎన్నికల్లో కొంతవరకు తన ఉనికిని చాటుకున్న గులాబీ పార్టీ, పట్టణాల్లోనూ అదే స్థాయిలో పుంజుకోవాలని ఆశిస్తోంది. గత పాలనలో చేపట్టిన మౌలిక సదుపాయాల అభివృద్ధిని, ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తిని ఆయుధంగా చేసుకుని ఓటర్లను ప్రభావితం చేయాలనే ప్రయత్నం చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోతే, పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నార్థకాలు పెరిగే పరిస్థితి ఉందన్న భావన బీఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే గులాబీ పార్టీ మరింత కష్టాల్లో పడే అవకాశం ఉంది.
ఆరు గ్యారెంటీలే హస్తం ఆయుధం
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రధాన ఆయుధంగా మారింది ‘ఆరు గ్యారెంటీలు’. పట్టణ ప్రాంతాల్లో ఈ పథకాల లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉండటం అధికార పార్టీకి కలిసొచ్చే అంశం. ఉచిత బస్సు ప్రయాణం, మహిళల ఆర్థిక భద్రతకు సంబంధించిన పథకాలు, విద్యుత్ సాయంపై తీసుకున్న నిర్ణయాలు పట్టణ మధ్యతరగతి, దిగువ వర్గాలపై ప్రభావం చూపుతున్నాయి. అయితే, రైతు భరోసా, రుణమాఫీ వంటి అంశాల్లో ఉన్న అనిశ్చితిని ప్రతిపక్షాలు బలంగా ఎత్తిచూపుతున్నాయి. ఈ హామీలు వాస్తవంగా తమ జీవితాల్లో మార్పు తెచ్చాయా లేదా అన్నదానిపై ఓటర్లు ఎలా స్పందిస్తారన్నదే కాంగ్రెస్ భవితవ్యాన్ని నిర్ణయించనుంది.
బీజేపీ బలం పుంజుకుంటుందా..?
ఈ ద్వంద్వ పోరులో మూడో శక్తిగా బీజేపీ ముందుకు వస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సాధించిన విజయాల ఊపును మున్సిపల్ ఎన్నికల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో తనకు ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంకును పట్టణాల్లోనూ విస్తరించాలనే లక్ష్యంతో వ్యూహాలు రచిస్తోంది. ఆస్తి పన్నులు పెంచబోమన్న హామీ, అవినీతి రహిత పాలనపై నొక్కిచెప్పడం ద్వారా మధ్యతరగతి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కొన్ని కీలక పట్టణాల్లో గణనీయమైన స్థానాలు సాధించగలిగితే, తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ పాత్ర మరింత బలపడే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే, ఈ మున్సిపల్ ఎన్నికలు కేవలం పట్టణ పరిపాలనకు సంబంధించినవి కావు. ఇవి రానున్న ఎన్నికల రాజకీయ దిశను నిర్ధారించే సూచికలు. ఇక్కడ పట్టు సాధించిన పార్టీలు ధైర్యంగా ముందడుగు వేయగలవు. వెనుకబడిన పార్టీలు మాత్రం తమ వ్యూహాలను తిరిగి సమీక్షించుకోవాల్సిందే. తెలంగాణ రాజకీయ మార్పులకు పునాది ఈ మున్సిపల్ ఫలితాలే అని చెప్పడంలో సందేహం లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
