Munugodu Congress : మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్ధి ఆమేనా..?

Munugodu Congress : మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్ధి ఆమేనా..?
Munugodu Congress : మునుగోడులో అభ్యర్థిని దాదాపుగా ఫిక్స్‌ చేసింది కాంగ్రెస్

Munugodu Congress : మునుగోడులో అభ్యర్థిని దాదాపుగా ఫిక్స్‌ చేసింది కాంగ్రెస్. బరిలో నిలిచేది ఎవరే ప్రకటన మాత్రమే మిగిలింది. నలుగురు అభ్యర్ధులను పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్‌ అధిష్టానం.. వారి అభ్యర్ధిత్వంపై సర్వేలు చేయించింది. టికెట్ ఆశిస్తున్న నలుగురు నేతలకు సంబంధించి నియోజకవర్గ సర్వే నివేదికను సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్‌ సునీల్ కనుగోలు బృందం టీపీసీసీ పెద్దలకు అందజేయడంతో.. దానిని ఏఐసీసీకి పంపించారు. ఈ సర్వేలో మాజీమంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి టాప్‌ ప్లేస్‌లో ఉండడంతో.. దాదాపు స్రవంతికే టికెట్‌ ఇవ్వబోతున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే పాల్వాయి స్రవంతికి వచ్చినన్ని ఓట్లు చల్లమల్ల కృష్ణారెడ్డికి కూడా వచ్చాయని, ‌కానీ ప్రాధాన్యత క్రమంలో పాల్వాయి స్రవంతి ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. స్రవంతికి టికెట్‌ దాదాపు ఖాయమే అయినప్పటికీ.. సెప్టెంబర్‌ మొదటివారంలో మాత్రమే అధికారిక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. ఈలోపు మునుగోడు టికెట్‌ను ఆశించిన మిగిలిన వారిని బుజ్జగించి, పార్టీ కోసం వారి సేవలను వినియోగించుకునేలా కసరత్తు చేస్తోంది.

సెప్టెంబరు మొదటి వారంలో మునుగోడు అభ్యర్థిని ఖరారు చేయాలని తెలంగాణ కాంగ్రెప్‌ నిర్ణయించిన నేపథ్యంలో నిన్న గాంధీ భవన్‌లో ఆశావహులతో కీలక నేతల భేటీ జరిగింది. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మునుగోడు ఉప ఎన్నిక ఇన్‌ఛార్జ్ రాంరెడ్డి దామోదర్‌రెడ్డి.. టికెట్‌ ఆశిస్తున్న వారి అభిప్రాయాలు సేకరించారు. ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా సంప్రదింపులు జరిపారు. వాళ్లు చెప్పిన అంశాలను నోట్‌ చేసుకున్నారు. ముందుగా పాల్వాయి స్రవంతికి అవకాశం ఇవ్వగా ఆమె 15 నిమిషాల పాటు తన అభిప్రాయాలు వెల్లడించారు. ఆ తర్వాత పున్న కైలాష్‌ నేత, పల్లె రవి.. తమకున్న బలాబలాల గురించి త్రిమెన్‌ కమిటీ ముందు వివరించారు.

చివరగా వెళ్లిన చల్లమల్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్‌ విజయం కోసం తాను ఏ త్యాగానికైనా సిద్ధమని, తనకు అవకాశం కల్పిస్తే ముందుకెళ్తానని కమిటీ ఎదుట తెలిపినట్లు తెలుస్తోంది. ఆశావహులతో ఇప్పటికే రెండుసార్లు సమావేశమైన పీసీసీ నేతలు.. నిన్న జరిగిన భేటీ చివరిదని చెబుతున్నారు. ఈ నలుగురి పేర్లలో ఇద్దరితో తుది జాబితా రూపొందించి ఢిల్లీకి పంపినట్టు తెలిసింది.

Tags

Read MoreRead Less
Next Story