Osmania University: ఓయూలో రాహుల్ పర్యటన అనుమతి నిరాకరణపై NSUI ఫైర్..

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీపర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంతో వివాదం కొనసాగుతోంది. వైస్ ఛాన్స్లర్ అనుమతి నిరాకరించడంతో NSUI విద్యార్ధులు మండిపడ్డారు. ఓయూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓయూలో రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ NSUI విద్యార్ధులు చేపట్టిన మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది.
రోడ్డుపై బైఠాయించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో.. ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. పలువురు విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మినిస్టర్ క్వార్టర్స్వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో విద్యార్ధులను పరామర్శించేందుకు వెళ్లిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టుచేసి బంబారాహిల్స్ పోలీస్టేషన్కు తరలించారు.
పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఓయూలో రాహుల్ గాంధీ విసిట్ కోసం న్యాయపరమైన ప్రయత్నంచేస్తామని జగ్గారెడ్డి తెలిపారు. రాహుల్ పర్యటనను ప్రభుత్వం అడ్డుకున్నా సరే .. తీసుకెళ్లి తీరుతామన్నారు. రాహుల్గాంధీ సందర్శనకు ఓయూ వైస్ ఛాన్స్లర్ అనుమతి నిరాకరించడంపై ఎన్ఎస్యూఐ విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓయూ ఛాన్స్లర్ ఛాంబర్ను విద్యార్థులు ముట్టడించే ప్రయత్నం చేశారు.
వీసీ రవీందర్ యాదవ్ ఛాంబర్ ఎదుట చీర గాజులతో నిరసనకు దిగారు. సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని దహనం చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఎన్ఎస్ యూఐ రాష్ట్రఅధ్యక్షులు బల్మూరి వెంకట్తోపాటు 17మందిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. దీంతో అరెస్టుచేసిన వారిని విడుదల చేయాలంటూ ఓయూ పీఎస్ ఎదుట విద్యార్ధులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఓయూలో ఉద్రిక్తలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.
పోలీసులు టీఆర్ఎస్ తొత్తులుగా మారారని విమర్శించారు. రాహుల్ ఉస్మానియాలో పర్యటిస్తే తప్పేంటని నిలదీశారు కేంద్ర మాజీ మంత్రి గీతా రెడ్డి. అనుమతి ఇవ్వకుండా వీసీపై ఎందుకు ఒత్తిడి తెస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాహుల్ ఓయూ పర్యటనతో బండారం బయటపడుతుందని భయపడుతున్నారని ఆరోపించారు. ఓయూ ఏఒక్క పార్టీకి సంబంధించినది కాదన్నారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.
టీఆర్ఎస్ పాలనలో ఓయూలో అంతా నిర్లక్ష్యమే ఉందన్నారు. రాహుల్ గాంధీకోసం ఉస్మానియా విద్యార్ధులు ఎదురుచూస్తున్నారన్నారు. రాహుల్ పర్యటనతో ఇవన్నీ బయటపడుతాయనే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో పోలీసు రాజ్యం ఉందని చెప్పడానికే ఇదే ఉదహారణ అని మండిపడ్డారు మాజీఎంపి మల్లు రవి. టీఆర్ఎస్ పాలనలో ఓయూ దిక్కు దివానం లేకుండాపోయిందన్నారు. రాహుల్ గాంధీ ఒక ఎంపి ఆయన .. పర్యటనను అడ్డుకోవడం దారణం అన్నారు.
విద్యార్ధులు, జగ్గారెడ్డి అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. మొత్తం మీద రాహుల్ తెలంగాణ పర్యటన కాకరేపుతోంది. తెలంగాణ ఉద్యమానికి కీలకంగా మారిన ఓయూనుంచే .. ప్రభుత్వంపై పోరాటానికి నాందిపలికింది టీకాంగ్రెస్. అందుకే పక్కాప్లాన్తో రాహుల్ను పర్యటనను ఖరారుచేసింది. అయితే హైకోర్టు ఆదేశాలతోనే తాము ఓయూ పర్యటనకు అనుమతి ఇవ్వడంలేదని అధికారులు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com