Old City Tension : పాత బస్తీలో కొనసాగుతున్న హైటెన్షన్..

Old City Tension : హైదరాబాద్ పాతబస్తీలో అదే టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఇవాళ శుక్రవారం అవడంతో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. మక్కా మసీదు పరిసరాల్లో అణువణువు నిఘా పెట్టారు. ఎంజే మార్కెట్ నుంచి ఓల్డ్ సిటీ వరకు హై అలర్ట్ ప్రకటించారు. రాజాసింగ్ వాఖ్యలకు నిరసనగా ఇవాళ చార్మినార్లో నిరసనలు కొనసాగిస్తామని ప్రకటించారు. అయితే, రాజాసింగ్ను అరెస్ట్ చేసినందున ఎటువంటి నిరసనలు చేయొద్దంటూ ఓవైసీ పిలుపునిచ్చారు. జుమ్మా సందర్బంగా చేసే నమాజ్ను శాంతియుతంగా చేసుకోవాలని అసదుద్దీన్ ఓవైసీ సూచించారు. నమాజ్ తర్వాత అందరూ ప్రశాంతంగా వెళ్లిపోవాలన్నారు ఓవైసీ.
ఇవాళ ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న నేపథ్యంలో చార్మినార్ పరిసర ప్రాంతాలు, పాతబస్తీలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు సాధారణ పోలీసులను భారీగా దింపారు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉన్న దుకాణాలను నిన్న రాత్రి ఏడు గంటలకే మూసేయించారు. పోలీసులు గస్తీ వాహనాలతో పహారా కాస్తున్నారు. చార్మినార్ పరిసర ప్రాంతాలకు ఎవ్వరినీ అనుమతించడం లేదు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. చార్మినార్ నాలుగు దిక్కులా.. బారికేడ్లను ఏర్పాటు చేశారు.
మరోవైపు రాజాసింగ్కు మద్దతుగా నిన్నటి నుంచి బేగంబజార్లో బంద్ పాటిస్తున్నారు. ఎంజే మార్కెట్, బేగం బజార్ ప్రాంతాల్లో నిన్నటి నుంచి రాజాసింగ్కు మద్దతుగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే రాజాసింగ్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ కూడా నిరసనలకు పిలుపునిచ్చారు. అటు రాజాసింగ్ వ్యాఖ్యలకు నిరసనగా ఓవర్గం వాళ్లు నిరసనలకు పిలుపునివ్వడం, రాజాసింగ్కు మద్దతుగానూ నిరసనలు చేస్తామనడంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. పాతబస్తీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com