Telangana : లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న బీజేపీ

Telangana : లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న బీజేపీ
X
ఈ నెలాఖరున ప్రధాని మోదీ బహిరంగ సభలు

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక సీట్లు గెలవడమే లక్ష్యంగా భాజపా పార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. రాష్ట్రంలో 10 MP సీట్లు, 35శాతం ఓటు బ్యాంకు పొందేలా ప్రణాళికలు రచిస్తోంది. ఎన్నికల సమన్వయం కోసం పార్లమెంట్ కన్వీనర్లతో పాటు ఆర్గనైజింగ్‌ ఇన్‌ఛార్జ్‌లను నియమించాలని సన్నాహాక సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరున ప్రధాని మోదీ బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా ప్రచారభేరి మోగించనుంది.

భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్లమెంట్‌ ఎన్నికలపై రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈ భేటికి రాష్ర్ట పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షత వహించగా రాష్ర్ట ఇన్‌ఛార్జ్‌లు తరుణ్‌ చుగ్‌, సునీల్ బన్సల్‌, సహ ఇన్‌ఛార్జి అరవింద్ మీనన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అభ్యర్థుల ఎంపిక, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ర్ట పదాధికారులు, పార్లమెంట్‌ ఇన్‌ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో జాతీయ నాయకత్వం నిర్దేశించిన పది ఎంపీ, 35 శాతం ఓట్ల సాధించడమే లక్ష్యంగా చర్చించారు. ఇందులో భాగంగా పార్లమెంట్‌ నియెజకవర్గాలకు ఇన్‌ఛార్జిలను నియమించారు. ఎనిమిది మంది MLAలు, ఒక్క ఎమ్మెల్సీకి బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల సమన్వయయం కోసం పార్లమెంట్‌ కన్వీనర్లతో పాటు ఆర్గనైజేషన్‌ ఇన్‌ఛార్జీలను నియమించాలని యోచిస్తోంది. జిల్లా అధ్యక్షులతో పాటు రాష్ర్ట పదాధికారుల్లో మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టింది. 15 నుంచి 20 జిల్లాల అధ్యక్షులను మార్చాలని నిర్ణయించింది. ఇప్పటికే జిల్లా అధ్యక్షుల పేర్లను ఖరారు చేసి జాతీయ నాయకత్వానికి రాష్ర్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి అందజేశారు.

సన్నాహాక సమావేశంలో ఎన్నికల రూట్‌ మ్యాప్‌ ను సిద్ధం చేసినట్లు సమాచారం. పార్లమెంట్‌ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా జిల్లాలు, వర్గాల వారీగా సమావేశమై ఎన్నికల ప్రణాళికకు సంబంధించిన అంశాలను సేకరించాలని భావిస్తోంది. కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువతను స్వయంగా వెళ్లి కలవడంతో పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వారితో సమావేశాలు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. కేంద్ర సంక్షేమ పథకాలు, మోదీ సాహాసోపేతమైన నిర్ణయాలు, తెలంగాణకు కేటాయించిన నిధులు, గత భారాస సర్కారు వైఫల్యాలు, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలులో ఆలస్యం వంటి అంశాలను ప్రజలకు వివరించాలని నేతలు మార్గనిర్దేశం చేశారు. కేంద్రంలో మరోసారి భాజపా సర్కారు ఆవశ్యకతను వివరిస్తూ... ప్రతి గ్రామంలో కార్నర్‌ మీటింగ్స్‌ నిర్వహించాలని యోచిస్తోంది. ఈ నెలాఖరుకు ప్రధాని మోదీ అధికారిక పర్యటనలో భాగంగా రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో... ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పార్టీ తరుఫున సభలు పెట్టాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.

Tags

Next Story