MODI: తెలంగాణ సీఎంకు ప్రధాని మోదీ ఫోన్

MODI: తెలంగాణ సీఎంకు ప్రధాని మోదీ ఫోన్
X
ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ఆరా తీసిన ప్రధాని... కార్మికులను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా తీశారు. ఎలాంటి సాయం కావాలన్న చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోదీ.. ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. టన్నెల్లో ఎనిమిది మంది చిక్కుకున్నారని... వారిని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రేవంత్... ప్రధానికి వివరించారు. ఇప్పటికే మంత్రులు ఘటనా స్థలంలో ఉన్నారని తెలిపారు. సహాయక చర్యల కోసం వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ టీంను పంపిస్తామని సీఎంకు ప్రధాని మోదీ చెప్పారు. పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

ప్రమాదంపై రేవంత్ సమీక్ష

ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఘటనా స్థలంలోని పరిస్థితిని మంత్రి ఉత్తమ్.. ముఖ్యమంత్రికి వివరించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. సహాయక చర్యల విషయంలో ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కార్మికులను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రమాదం ఎలా జరిగిందంటే.. ?

శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్‌ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. దోమలపెంట దగ్గర 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్‌ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పనులను ప్రారంభించింది. నాలుగు రోజుల క్రితం ఈ పనులు మొదలయ్యాయి. పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. టన్నెల్‌ పైభాగంలో మూడు మీటర్ల మేర పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఎడమగట్టు కాలువ టన్నెల్‌ ద్వారా నల్గొండ జిల్లాకు సాగు, తాగు నీరు ఇవ్వడానికి ఈ ప్రాజెక్టు చేపట్టారు.

Tags

Next Story