Cheating: పెళ్లి చేసుకుంటా.. దేశాలు తిప్పుతా.. మ్యాట్రిమోనిలో భారీ మోసం

Cheating: పెళ్లి చేసుకుంటా..  దేశాలు తిప్పుతా.. మ్యాట్రిమోనిలో భారీ మోసం
X
పార్టనర్ వీసా కోసం సిబిల్ స్కోరు 850 ఉండాలని నమ్మబలికిన మోసగాడు

మ్యాట్రిమొనీలో తప్పుడు వివరాలు నమోదు చేసి మహిళలకు టోకరా వేసిన ఉదంతాలు గతంలో చాలా జరిగాయి. అవతలి వ్యక్తి ఎవరో నిర్ధారించుకోలేక, ప్రొఫైల్ లో కనిపించే వివరాలే నిజమని నమ్మిన అనేకమంది మహిళలు పలు విధాలా నష్టపోయిన ఘటనలు ఉన్నాయి.తాజాగా, హైదరాబాదులో ఇలాంటిదే ఓ ఘటన జరిగింది. మ్యాట్రిమొనీలో పరిచయమైన మహిళకు ఓ ఘరానా మోసగాడు రూ.2.71 కోట్ల మేర టోకరా వేశాడు.

షాది.కామ్‌ మ్యాట్రిమోనిలో మహిళను మోసం చేసి, భారీ మొత్తంలో డబ్బు కాజేసిన సైబర్‌ నేరస్థుడు శ్రీబాల వంశీకృష్ణను సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈనెల 16వ తేదీన హైదరాబాద్‌ మదీనాగూడకు చెందిన బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. షాదీ.కామ్ మ్యాట్రీమోనీలో మహిళతో పరిచయం పెంచుకుని, తను గ్లెన్‌మార్క్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్​గా విధులు నిర్వర్తిస్తున్నట్లు, సదరు మహిళను అమెరికా తీసుకెళ్తానని మోసపు వాగ్దానాలు చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

అందుకు తన సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉందని, పెంచేందుకు తన కంపెనీ నుంచి రుణాలు ఇస్తానని నమ్మబలికి, ఆమెకు సంబంధించిన బ్యాంకు వివరాలు తీసుకుని 2.71 కోట్ల రూపాయలు కాజేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడిపై గతంలో 9 కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడి నుంచి పలు బ్యాంకులకు చెందిన 6 పాస్‌ బుక్‌లు, 10 డెబిట్‌ కార్డులు, మూడు ఫోన్లు, 4 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అపరిచితుల నుంచి వచ్చే మెసేజ్‌లను నమ్మవద్దని, ఎట్టి పరిస్థితుల్లో అపరిచితులకు డబ్బు పంపకూడదని, సైబర్‌ నేరం జరిగిన వెంటనే 1930కి ఫోన్‌ చేయాలని సైబర్‌ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.

ఇదికాగా మరోవైపు నకిలీ పోలీసుల పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ కాల్స్‌ చేస్తున్నారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఎక్స్ వేదికగా తెలిపారు. పార్సిళ్లలో డ్రగ్స్‌, తీవ్రవాదులతో బ్యాంక్‌ లావాదేవీలు చేశారంటూ భయభ్రాంతులకు గురిచేస్తూ కోట్లలో కుచ్చుటోపీ పెడుతున్నారన్నారు. ఏ మాత్రం అనుమానం రాకుండా అచ్చం పోలీసుల్లాగానే బిల్డప్‌ ఇస్తూ, తమ ఐడీ కార్డులను, ఎఫ్‌ఐఆర్‌ (FIR)కాపీలను పంపిస్తూ మోసాలకు తెగబడుతున్నారని ట్వీట్​ చేశారు.

అందుకు సంబంధించిన ఫొటోలను సజ్జనార్​ దానికి జతచేశారు. తాజాగా ఐఐటీ హైదరాబాద్‌లో ఓ పీహెచ్​డీ (PHD) స్కాలర్​కు ఫోన్‌ కాల్‌ చేసి అక్షరాల రూ. 30 లక్షలను దోచేశారని పేర్కొన్నారు. మోసపోయానని గుర్తించిన ఆ వ్యక్తి, సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారన్నారు. నేరాలపై అప్రమత్తంగా ఉండాల్సిన ఉన్నత విద్యావంతలే, మోసాలకు గురవడం బాధాకరమని సజ్జనార్‌ ఎక్స్​లో పేర్కొన్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్‌తో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఒకవేళ మోసానికి గురైతే వెంటనే స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలన్నారు.

Tags

Next Story