Chikoti Praveen: చికోటి ప్రవీన్‌ ఈవెంట్లు.. లిస్ట్‌లో పలువురు సినీ ప్రముఖులు..

Chikoti Praveen: చికోటి ప్రవీన్‌ ఈవెంట్లు.. లిస్ట్‌లో పలువురు సినీ ప్రముఖులు..
Chikoti Praveen: డబ్బున్న వాళ్లే టార్గెట్‌గా చికోటి ప్రవీణ్‌ క్యాసినో ఈవెంట్లు ప్లాన్‌ చేస్తాడు.

Chikoti Praveen: డబ్బున్న వాళ్లే టార్గెట్‌గా చికోటి ప్రవీణ్‌ క్యాసినో ఈవెంట్లు ప్లాన్‌ చేస్తాడు. క్యాసినో పేరుతో కోట్లు కొల్లగొడతాడు..దేశంకానీ దేశంలో, రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఎక్కడైనా హవా తన హవా నడిపించే సత్తా అతడిది. ఇంతలా ప్రవీణ్‌ హవా సాగడానికి అతని చుట్టూ కొంతమంది మంత్రులు,మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు,డీసీసీబీ ఛైర్మన్‌లు ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు.. కోలీవుడ్ నుంచి శాండిల్‌వుడ్ వరకు.. చికోటి ప్రవీణ్‌ పేరు తెలియని హీరో, హీరోయిన్లు ఉండరేమో. ఈవెంట్‌కు రావాలని ఆయన పిలిస్తే.. రాని సెలబ్రేటిలు ఉండరంటే మనోడి సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు.

లగ్జరీ కార్లు, ఓపెన్‌ ఫార్మ్‌ హౌజ్‌లు.. లగ్జరీ పార్టీలు.. డబ్బుకు విలువివ్వని మైండ్ సెట్ అతడిది. అసలు తాము ఎంత సంపాదిస్తున్నామో..తమ దగ్గర ఎంతుందో కూడా తెలియనంత సంపాదన. అది చికోటి ప్రవీణ్‌ రేంజ్. మొన్నటిదాకా శ్రీలంకలో క్యాసినో ఆడటానికి అలవాటుపడి.. అక్కడ సంక్షోభం వల్ల కొన్నాళ్లుగా దూరంగా ఉన్న పేకాటరాయుళ్లు .. వీళ్ల బుట్టలో పడ్డారు. హైదరాబాద్‌, వరంగల్‌, విశాఖపట్నం, విజయవాడ, భీమవరం, గుంటూరు, నెల్లూరు, ఏలూరుకు చెందిన దాదాపు 200 మంది ఈవెంట్‌లో పాల్గొన్నారు. వారందరినీ శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానాల్లో పశ్చిమబెంగాల్‌లోని బాగ్‌డోగ్రా విమానాశ్రయానికి తీసుకెళ్లారు.

అక్కడి నుంచి రోడ్డుమార్గంలో బస్సుల ద్వారా నేపాల్‌లోని మోచీక్రౌన్‌ హోటల్‌కు తరలించారు. అక్కడే దాదాపు 200 మంది జూదరులు నాలుగు రోజుల పాటు బసచేశారు. ఈ ఈవెంట్‌లో దాదాపు 15 మంది బాలీవుడ్‌, టాలీవుడ్‌తో పాటు నేపాల్‌ మోడళ్లతో డ్యాన్స్ లు వేయించారు. ఈ లిస్ట్‌లో అమీషా పాటేల్, ముమైత్‌ఖాన్, ఇషారెబ్బ, మల్లికా షెరావత్, సింగర్ జాన్సీరాజు ఉన్నారు. మరోవైపు సినీ స్టార్లకు చికోటి ప్రవీణ్‌ చెల్లించిన భారీ చెల్లింపులను గుర్తించింది ఈడీ. మల్లికా షెరావత్‌కు కోటి రూపాయలు..అమీషా పటేల్‌కు 80లక్షలు,నటుడు గోవిందాకు యాభై లక్షలు, ఇషారెబ్బాకు నలభైలక్షలు, డింపుల్‌ హయాతీకి నలభై లక్షలు, గణేష్‌ ఆచార్యకు ఇరవై లక్షలు,ముమైత్‌ఖాన్‌ కు పదిహేను లక్షలు చెల్లించినట్లు ఈడీ గుర్తించింది.

ఈ సినీ తారలకు కూడా నోటీసులు ఇవ్వనున్నారు ఈడీ అధికారులు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు..చికోటీ ప్రవీణ్‌, మాధవరెడ్డి ఇళ్లల్లో తనిఖీలు చేశారు. సైదాబాద్‌ ఐఎస్‌సదన్, బోయిన్‌పల్లి, సిటీ శివారులోని కడ్తాల్.. ఇలా 8 ప్రాంతాల్లో దాదాపు 20 గంటల పాటు సోదాలు జరిగాయి. హవాలా ద్వారా వెళ్లిన నగదుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈడీ విచారణపై స్పందించిన చికోటి ప్రవీణ్‌…అధికారుల ముందే అంతా వివరిస్తానని చెప్పాడు.

Tags

Read MoreRead Less
Next Story